రైతుపై పచ్చిరొట్ట భారం | - | Sakshi
Sakshi News home page

రైతుపై పచ్చిరొట్ట భారం

May 26 2025 12:48 AM | Updated on May 26 2025 12:48 AM

రైతుపై పచ్చిరొట్ట భారం

రైతుపై పచ్చిరొట్ట భారం

బాన్సువాడ రూరల్‌: భూసారం పెంచేందుకు ప్రభుత్వం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన విత్తనాలు అందిస్తోంది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈసారి ధరలను అమాంతం పెంచడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.

వరి సాగుకు నెలరోజుల ముందు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల సాగుకు సంబంధించిన విత్తనాలను భూమిలో చల్లుతారు. ఏపుగా పెరిగిన తర్వాత 35 నుంచి 40 రోజుల మధ్యలో భూమిలో కలియ దున్నుతారు. దీంతో ఎకరాకు 5 టన్నుల వరకు ఎరువు తయారవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతారు. ఇందులో 8 కిలోల భాస్వరం, 20 కేజీల పొటాష్‌, 35 కేజీల నత్రజని ఉంటుందని అధికారులు పేర్కొంటారు.

బస్తాపై వెయ్యికిపైనే..

ఎకరాకు 15 కేజీల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. కాగా గతంలో 60 శాతం సబ్సిడీ అందించగా.. ఈసారి దానిని 50 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా ధర సైతం భారీగా పెంచారు. గతేడాది 30 కేజీల జీలుగ విత్తనాల బస్తా ధర రూ. 1,116 ఉండగా ఈసారి రూ. 2,137 కి చేరింది. అంటే రైతులపై ఒక బస్తాకు రూ. 1,021 అదనపు భారం పడుతోందన్న మాట. అలాగే పిల్లి పెసర 20 కేజీల బస్తా ధర రూ. 1,084 నుంచి రూ. 2,055 కు పెరిగింది. జనుము 40 కేజీల బస్తా ధర గతేడాది రూ. 1,448 ఉండగా ఈసారి రూ. 2,510 కు చేరింది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు.

నాట్లపై ప్రభావం?

వరి సాగుకు నెలరోజుల ముందే పచ్చిరొట్ట సాగు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మే 15 వరకు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల సాగుకు సంబంధించిన విత్తనాలను భూమిలో చల్లుతారు. కానీ ఈసారి కొంత ఆలస్యంగా విత్తనాలు రావడంతో రెండు రోజుల క్రితం పంపిణీ ప్రారంభించారు. దీంతో రోహిణి కార్తెలో పోయాల్సిన నార్లు పక్షం రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

అమాంతం పెరిగిన ధరలు

30 కేజీల జీలుగ బస్తా రూ. 2,137

గతేడాది బస్తా ధర రూ. 1,116

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement