
మొరాయిస్తున్న తూము షటర్లు
నిజాంసాగర్: వరుణుడు కరుణిస్తున్నా.. చెరువులో నీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొనడంతో నర్వ, అన్నాసాగర్ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. తూములకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. మహమ్మద్నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులోగల పాత చెరువు కింద 456 ఎకరాల ఆయకట్టు ఉంది. అన్నాసాగర్, నర్వ గ్రామాల మధ్య పాత చెరువు ఉండడంతో కుడి, ఎడమ వైపులా రెండు తూములు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మిషన్ కాకతీయ పథకం కింద పాత చెరువును బాగు చేయగా తూముల షటర్లు నాసిరకంగా బిగించారు. దీంతో వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం ధాటికి చెరువుకు రెండు వైపులా ఉన్న తూముల షటర్లు కిందకు దిగడం లేదు. అవసరమైనప్పుడు వెంటనే పైకి కూడా లేవడం లేదు. రైతులు నానా తంటాలు పడుతూ తూములను పైకి ఎత్తుతున్నారు. యాసంగి సీజన్లో ఇలా కష్టపడి లేపిన షటర్లు కిందికి దిగడం లేదు. అంతేకాకుండా అన్నాసాగర్ వైపు ఉన్న తూము షటర్ మాయమయ్యింది. దీంతో పాత చెరువు రెండు తూముల ద్వారా నీరు వృథాగా వెళ్తోంది. వర్షాలతో చెరువులోకి కొత్త నీరు వచ్చి చేరుతున్నా నీరు నిలవడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. షటర్ల విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల తూములకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, నీరు నిల్వ ఉండేలా చూడాలని కోరుతున్నారు.
ఖాళీ అవుతున్న పాత చెరువు నీరు
ఆందోళన చెందుతున్న రైతులు

మొరాయిస్తున్న తూము షటర్లు