దోమకొండ: జిల్లాలో కామారెడ్డితో పాటు దోమకొండ, బీబీపేట, పిట్లం మండల కేంద్రాల్లో చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా సభ్యులు ఉన్నారు. దోమకొండలోనే 600 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరికి సరైన సౌకర్యాలు, ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందడం లేదు. కామారెడ్డి ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దోమకొండలో ఒకనాడు మగ్గాలపై చేనేత కార్మికులు నేసిన దుస్తులు హైదరాబాద్తో పాటు గుజరాత్ ప్రాంతాలకు సరఫరా చేసేవారు. మగ్గాలు మూలనపడి చేనేత కార్మికులు ప్రస్తుతం బీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నారు. ఇక్కడ గతంలో ఉన్న నేతన్నలు ఉపాధి కోసం సిరిసిల్లా, మహరాష్ట్రలోని భీవండి, ముంబయి, షోలాపూర్ వంటి ప్రాంతాలకు కుటుంబాలతో వలస వెళ్లారు. దోమకొండలో గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో గత రెండు నెలల క్రితం మండల కేంద్రంలోని ఆనంద్భవన్లో చేనేత కార్మికులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. సిరిసిల్లా ప్రాంతం నుంచి శిక్షకులను రప్పించి గ్రామంలో ఆసక్తి ఉన్న వారికి చేనేతలో శిక్షణ ఇస్తున్నారు. చేనేత సహకార సంఘం వారి సూచనలతో ఆసక్తి ఉన్న పలువురు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ సమయంలో కొంత నగదు కూడా ఇవ్వడంతో చాలా ముంది ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతలుగా దాదాపు 25 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు నేసిన దుస్తులను హైదరాబాద్తో పాటు ఆంధ్రా ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో గడికోట ట్రస్టు ప్రతినిధులు చొరవ చూపడంతో పలువురు నేతన్నలు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేనేత కుటుంబాలకు మేలు చేసినట్లువుతుంది. ఈ విషయంమై ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొవాలని నేతన్నలు కోరుతున్నారు.
గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో
చేనేత శిక్షణ
దుస్తులు నేస్తూ ఉపాధి
పొందుతున్న చేనేత కార్మికులు
జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు
చేయాలని డిమాండ్
ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ
దోమకొండలో గతంలో పెద్ద ఎత్తున చేనేత మగ్గాలు ఉండేవి.ప్రస్తుతం కార్మికులందరూ సిరిసిల్లాతో పాటు మహారాష్ట్రలోని భీవండి వంటి ప్రాంతాలకు వలసపోయారు. చేనేత వృత్తి కరుమరుగైంది. ఇక్కడి ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని గడికోట ట్రస్టు నిర్వహకులు, సంస్థాన వారసులు కామినేని అనిల్ సూచించారు. చేనేత సహకార సంఘాల వారి సూచనలతో సిరిసిల్లా ప్రాంతం నుంచి శిక్షకులకు రప్పించి ఇప్పటి వరకు రెండు విడతలుగా 25 మందికి శిక్షణ ఇచ్చాము. వారు ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు.
– బాబ్జి, గడికోట ట్రస్టు మేనేజర్, దోమకొండ
కలగానే చేనేత.. కరువైన చేయూత