
గ్రామ పాలనాధికారులు రాబోతున్నారు..
పడకేసిన రెవెన్యూ పాలన
● ఇతర శాఖల్లో భర్తీ చేసిన వీఆర్వో, వీఆర్ఏలకు నేడు ఎంపిక పరీక్ష
● మొదటి విడతలో రాష్ట్రంలో
6 వేల పోస్టుల భర్తీ
● మలి విడతలో నోటిఫికేషన్ ద్వారా
కొత్త వారికి అవకాశం!
● రెవెన్యూ పాలనను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు
కామారెడ్డి క్రైం : ధరణి స్ధానంలో భూభారతిని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో తొలగించిన వీఆర్వో, వీఆర్ఏల స్థానంలో గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల వ్యవస్థను తీసుకువచ్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,696 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించగా, ఇందులో కామారెడ్డి జిల్లాలోని 474 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు రానున్నారు. మొదటి విడతలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఆదివారం రోజున రాత పరీక్ష జరగనుంది. ఇందులో ఎంపికయ్యే వారికి జూన్ 2న పోస్టింగ్లు ఇవ్వనున్నారు.
మొదటి విడతలో సగం మంది
రాష్ట్రంలో 10,696 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో మొదటి విడతలో భాగంగా 6 వేల పోస్టులను భర్తీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి గతంలోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలో 474 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 90వ దశకంలో అప్పటి ప్రభుత్వం రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి క్లస్టర్కు ఒక రెవెన్యూ అధికారిని కేటాయించింది. ఈ లెక్కన జిల్లాలో ఇదివరకు 215 మంది వీఆర్వోలు ఉండేవారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్ధలను గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలన అధికారి పేరిట రెవెన్యూ అధికారుల నియామకం చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలో 474 రెవెన్యూ గ్రామాలకు పోస్టింగ్లు రానున్నాయి. ఇందుకోసం గతంలో పని చేసిన వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంటర్ ఉత్తీర్ణలై గతంలో కనీసం 5 సంవత్సరాలపాటు వీఆర్వోగా గానీ, వీఆర్ఏగా గానీ పని చేసిన అనుభవం ఉన్న వారికి తిరిగి రెవెన్యూ శాఖ లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి వారు 402 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. వారందరికీ రాత పరీక్ష నేడు (25న) జరగనుంది. అందులో ఎంపికై న వారికి జూన్ 2న గ్రామ రెవెన్యూ అధికారులుగా పోస్టింగ్లు దక్కనున్నాయి. మిగిలిన పోస్టులను రెండో విడతలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
త్వరలోనే అందుబాటులోకి సేవలు
గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన 402 మంది గ్రామపాలన అధికారి పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. రాత పరీక్షలో ఎంపికై న వారికి పోస్టింగ్లు దక్కుతాయి. జూన్ మొదటి వారంలో మొదటి విడతకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావచ్చు.
– మస్రూర్ అహ్మద్, కలెక్టరేట్ పాలనాధికారి. కామారెడ్డి
గత ప్రభుత్వం 2015లో ధరణి పేరిట ఆన్లైన్ వెబ్సైట్ను ప్రారంభించి రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేయించింది. ఈ ప్రక్రియ 2019 వరకు కొనసాగింది. రికార్డులను ఆన్లైన్ చేసే క్రమంలో ప్రతి జిల్లా రికార్డుల్లోనూ వేల సంఖ్యలో త ప్పిదాలు చోటుచేసుకున్నాయి. ధరణిలో వాటిని సరి చేసేందుకు ఆప్షన్లు లేక రైతులు నానా అవస్థలు పడ్డారు. సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే భావనతో ఉద్యోగులను ఇతర శాఖల్లో భర్తీ చేస్తూ 2022లో వీఆర్వో, 2023లో వీఆర్ఏ వ్యవస్థలను ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి వాస్తవమే అనే ఘటనలు సైతం అప్పట్లో చాలానే వెలుగుచూశాయి. కానీ వీఆర్వో, వీఆర్ఏ వ్వవస్థలను రద్దు చేశాక గ్రామాల్లో పాలన మొత్తం దాదాపుగా పడకేసింది. రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. ధరణిని రద్దు చేసి భూ భారతి సేవలు అందుబాటులోకి తేవడం, గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం దొరకొచ్చని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భూ భారతితోపాటు గ్రామపాలన అధికారుల వ్యవస్థ కూడా వస్తే రెవెన్యూ సేవలు వేగవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. జవాబుదారీతనం పెరిగి పనులు వేగవంతంగా పూర్తి కావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.