మావోళ్లు ఎట్లున్నరో.. | - | Sakshi
Sakshi News home page

మావోళ్లు ఎట్లున్నరో..

May 24 2025 1:16 AM | Updated on May 24 2025 1:16 AM

మావోళ

మావోళ్లు ఎట్లున్నరో..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో నక్సల్స్‌ ఏరివేత కొనసాగుతోంది. ఇందులోభాగంగా జరిగిన ఎన్‌కౌంటర్లలో నక్సల్స్‌ చనిపోతుండడంతో జిల్లాకు చెందిన నక్సల్స్‌ గురించి చర్చ

నడుస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి ఐదుగురు అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీంతో వారి కుటుంబాలు, బంధువులు తమ వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన చెందుతున్నారు.

● కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి 1995లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం దండకారణ్యంలో వెస్ట్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతనిపై రూ.20 లక్షల రివార్డు ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

● పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్‌ దినేష్‌ 2001 లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆజాద్‌ ప్రొటెక్షన్‌ టీంలో సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ఉంది.

● కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి చెందిన లోకేటి రమేశ్‌ 2009లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈయన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి కొడుకు. తండ్రి బాటలోనే విప్లవోద్యమంలోకి వెళ్లాడు. సౌత్‌ బస్తర్‌లో కొంటా ఏరియా కమిటీ డీసీఎంగా పనిచేస్తున్నాడు. ఇతనిపై రూ.4 లక్షల రివార్డు ఉంది.

● లోకేటి లావణ్య అలియాస్‌ శాంతి 2009లో అజ్ఞాతంలోకి వెళ్లింది. ఈమె లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి కూతురు. ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తోంది. ఈమైపె రూ.4 లక్షల రివార్డు ఉంది.

● సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన లింబయ్యగారి వెంకట్‌రెడ్డి 1999 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడన్నది పోలీసులకు తెలియదు. అతనిపై రూ.లక్ష రివార్డు ఉంది.

అజ్ఞాతంలో జిల్లాకు చెందిన

ఐదుగురు నక్సల్స్‌

వరుస ఎన్‌కౌంటర్లతో

వారి కుటుంబాల్లో ఆందోళన

తమవారి క్షేమ సమాచారంపై ఆరా!

అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్‌ వీరే..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఇటీవల దండకారణ్యంలో కేంద్ర బలగాలు జరుపుతున్న దాడుల్లో పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ చనిపోయారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్‌కౌంటర్‌ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్‌ గురించి జిల్లాలో చర్చ నడుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఆ ఐదుగురు దశాబ్దాల కాలంగా ఇంటిని విడిచి వెళ్లారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నరో, ఎట్లున్నరో కూడా ఆయా కుటుంబాలకు తెలియదు. కానీ కాల్పుల్లో నక్సల్స్‌ చనిపోయారని తెలిస్తే చాలు ఆ కుటుంబాలు వణికిపోతున్నాయి. వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎలా ఉన్నారోనని వారి కుటుంబాలు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

1990–2000లో విస్తృత కార్యకలాపాలు

ఉమ్మడి జిల్లాలో సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌ కార్యకలాపాలు అప్పట్లో జోరుగా సాగేవి. కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్‌ సమాంతర పాలన సాగించారు. 1990 నుంచి 2000 మధ్య కాలంలో ఆ పార్టీ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వాలు విధించిన తీవ్ర నిర్భందంతో చాలా మంది లొంగిపోయారు. అలాగే అరెస్టులు, ఎన్‌కౌంటర్లతో జిల్లాలో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ పార్టీ 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించే నాటికి జిల్లాలో అనేక నష్టాలను చవిచూసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్‌తోపాటు మిలిటెంట్లు, సానుభూతి పరులు 125 మంది వరకు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది అరెస్టయ్యారు. అలాగే వందలాది మంది లొంగిపోయారు. మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గంగుల వెంకటస్వామి అలియాస్‌ రమేశ్‌ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు మరింతగా విస్తరించాయి. ముఖ్యంగా ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఊరూరా సాయుధ నక్సల్స్‌ వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో మానాల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో జిల్లా కార్యదర్శి గంగుల వెంకటస్వామితో సహా 12 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో జిల్లాలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండాపోయింది. ఏదేమైనా ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్‌కౌంటర్‌ జరిగినా జిల్లాలో అజ్ఞాత నక్సల్స్‌ గురించి విస్తృత చర్చ జరుగుతోంది.

మావోళ్లు ఎట్లున్నరో..1
1/4

మావోళ్లు ఎట్లున్నరో..

మావోళ్లు ఎట్లున్నరో..2
2/4

మావోళ్లు ఎట్లున్నరో..

మావోళ్లు ఎట్లున్నరో..3
3/4

మావోళ్లు ఎట్లున్నరో..

మావోళ్లు ఎట్లున్నరో..4
4/4

మావోళ్లు ఎట్లున్నరో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement