
ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి సహించం
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే సహించమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. అధికారులుగాని, కమిటీ సభ్యులుగాని అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట రైతువేదికలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరుపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వ హాయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని ఆయన చెప్పారు. అంతకుముందు మండలంలోని జలాల్పూర్, గోపాల్పేట, మాల్తుమ్మెద గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 120 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎల్లారెడ్డి మండలంలోని దావల్ మాల్క పల్లి, సబ్దల్పూర్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే మదన్మోహన్ భూమిపూజ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ రజితరెడ్డి, మాజీచైర్మన్ వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, , మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్, డీఎల్పీవో సురేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మాజీచైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డిపేట మాజీసర్పంచ్ విఠల్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో ప్రభాకరచారి, పార్టీ నాయకులు తదితరులున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు
పత్రాల అందజేత