
ధనిక రైతుల నియోజకవర్గంగా మారుస్తా
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ధనిక రైతుల నియోజకవర్గంగా మారుస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్రావు అన్నారు. మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న కాళేశ్వరం ప్యాకేజీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించానని, పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్ పనులు నిలిపి వేశారని, తాను పలుమార్లు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించడంతోపాటు రెండు సార్లు అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించగా తక్షణమే రూ.23 కోట్లు మంజూరయ్యాయని, 14,500 ఎకరాలకు సాగునీరందించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు సూచించినట్లు తెలిపారు. కాటేవాడి, ధర్మారావ్పేట్, మోతె, రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. సదాశివనగర్ మండలంలో 24,590 ఎకరాలు, గాంధారి మండలంలో 13,546 ఎకరాలు, రామారెడ్డి మండలంలో 8,664 ఎకరాలు, తాడ్వాయి మండలంలో 20,220 ఎకరాలు, రాజంపేట మండలంలో 2,593 ఎకరాలు, లింగపేట మండలంలో 22,934 ఎకరాలు, ఎల్లారెడ్డి మండలంలో 3,200 ఎకరాలు, నాగిరెడ్డిపేట మండలంలో 3,100 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. నిజామాబాద్ జిల్లా కొండెం చెరువు లింక్ ద్వారా 11.5టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా 3వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం తాను స్వయంగా రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామ గ్రామాన బోర్లు తవ్వించి తాగునీటి సౌకర్యం కల్పించానన్నారు. భూంపల్లి రిజర్వాయర్ 22వ ప్యాకేజీకి నిధుల మంజూరులో మాజీమంత్రి షబ్బీర్ అలీ కృషి ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, తాను పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించడంతోనే నిధులు మంజూరు అయినట్లు సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యే దాక పట్టువదలనని స్పష్టం చేశారు.
అలాగే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. మూడు నుంచి ఆరు నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్, వైస్ ఎంపీపీలు శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్రెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాగయ్య, మాజీ సర్పంచ్ రవీందర్గౌడ్, నవీన్రావు, విండో చైర్మన్ గంగాధర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
గెలిచిన 14 రోజుల్లోనే కాళేశ్వరం పనుల పురోగతిపై సమీక్షించా
పనులపై అసెంబ్లీలో రెండుసార్లు ప్రస్తావించాను
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి
పలుమార్లు సమస్యలను విన్నవించా
చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ఇది
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు