పైసలిస్తే బకాయి బాధ లేదు | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తే బకాయి బాధ లేదు

May 23 2025 2:17 AM | Updated on May 23 2025 2:17 AM

పైసలిస్తే బకాయి బాధ లేదు

పైసలిస్తే బకాయి బాధ లేదు

ట్రేడ్‌ లైసెన్స్‌ జారీలో

ఇష్టారాజ్యం

జేబులు నింపితే

పాత బకాయిలు ఊసే ఉండదు

పాత దుకాణానికి కొత్త లైసెన్స్‌ రెడీ

బల్దియా ఆదాయానికి

గండికొడుతున్న సిబ్బంది

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి బల్దియా అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శానిటేషన్‌ విభాగంలో ట్రెడ్‌ లైసెన్స్‌ జారీలో బల్దియా ఆదాయాన్ని పెంచే సిబ్బంది అక్రమ సంపాదన కోసం ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పైసలిస్తేనే టెడ్ర్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారని కొందరు, రెన్యువల్‌ చేయాల్సిన లైసెన్స్‌లను పట్టించుకోకుండా వాటి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా నూతన లైసెన్స్‌లు జారీ చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా, లక్షకు పైగా జనాభా, 24,484 ఇళ్లు ఉన్నాయి. పట్టణంలో ప్రతి ఏటా 4,800కు పైగా ట్రేడ్‌లైసెన్స్‌లు జారీ చేయగా వాటి ద్వారా రూ. 36లక్షల నుంచి రూ.40లక్షల వరకు బల్దియాకు ఆదాయం సమకూరుతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో నిబంధనల ప్రకారం వ్యాపార దుకాణాల విస్తీర్ణం, కొలతలను నిజాయితీగా తీసుకుని ట్రేడ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తే మరో రూ.20 లక్షకుపైగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కానీ మున్సిపల్‌ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ట్రేడ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.

భారీగా వసూళ్లు..!

లైసెన్స్‌లు సంబంధించి రెన్యువల్‌ బకాయిలను వసూలు చేసి బల్దియా ఆదాయాన్ని పెంచాల్సిన సిబ్బంది తమ జేబులు నింపుకుంటున్నారు. పాత లైసెన్స్‌ల బకాయిలను వసూలు చేయకుండా వాటి స్థానంలో నూతన లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. గతంలో సానిటేషన్‌ విభాగంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి అచ్చినకాడిని దండుకుని బదిలీపై వెళ్లిన వారున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ అధికారి ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీలో ఇదే తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు, అలాగే పైస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ వారికి కూడా డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు విచారణ జరిపితే సానిటేషన్‌ విభాగంలో భారీ కుంభకోణం గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై మున్సిపల్‌ సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నగేశ్‌ను వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డిని అడగగా.. విచారణ చేస్తామని, అక్రమవసూళ్లకు పాల్పడినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement