
భూ భారతి సర్వేను వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): భూ భారతి సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. లింగంపేట తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సర్వే డెస్క్ను కలెక్టర్ గురువారం పరిశీలించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించామని, 4225 దరఖాస్తులు అందాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో 4100 దరఖాస్తులను పరిశీలించి, సర్వే చేయడం జరిగిందన్నారు. డెస్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సబ్కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
26న సబ్జూనియర్
అథ్లెటిక్స్ ఎంపికలు
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, కేపీ అనిల్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8గంటలకు కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అండర్–8, 10, 12 అథ్లెటిక్స్ (బాలబాలికల విభాగం) ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 60 మీటర్లు, 200, 300, 600 మీటర్ల స్టాండింగ్ బ్రాడ్జంప్, లాంగ్జంప్, కిడ్స్ జావెలిన్, షాట్పుట్ అంశాల్లో ఎంపికలుంటాయని, పాల్గొనే క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పని సరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
కామారెడ్డి టౌన్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కామారెడ్డి నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ప్రతి రోజూ సూపర్ లగ్జరీ బస్సు సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి నుంచి, తిరిగి కాళేశ్వరం నుంచి ఉదయం 6గంటలకు బయలుదేరుతుందన్నారు. పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.180 బస్సు చార్జీలు ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
పదోన్నతి
బాధ్యతను పెంచుతుంది
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను మరింత పెంచుతాయని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. ఇటీవల ఎస్సైలుగా పదోన్నతి పొందిన 11 మంది ఏఎస్సైలకు ఎస్పీ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీగా, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్దతతో పని చేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, మర్యాదలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు మదన్లాల్, యాకూబ్రెడ్డి, సీఐలు తిరుపతయ్య, సంతోష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంటగది సిలిండర్ లీకేజీ ప్రమాదాలను తినే సోడాతో ఆర్పివేయడం, ఆయిల్ ఫైర్లను మూత కప్పడం ద్వారా ఆర్పివేయడం, పిడుగుపాటు సమయంలో పాటించాల్సిన మెలకువలు, వివిధ రకాల అగ్నిప్రమాదాల్లో ఉపయోగించే పరికరాల వాడకంపై జిల్లా ఫైర్ అధికారి సుధాకర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి సర్వేను వేగవంతం చేయాలి

భూ భారతి సర్వేను వేగవంతం చేయాలి

భూ భారతి సర్వేను వేగవంతం చేయాలి