
అన్నదాతపై హమాలీ భారం
బాన్సువాడ : ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే హమాలీ లోడింగ్ ఖర్చు రైతులకు తడిసి మోపెడవుతుంది. కొన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో హమాలీలకు ఒక్కో బస్తాకు (40 కిలోలు) రూ. 15 నుంచి రూ. 20 రైతులు ఇస్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లో క్వింటాల్కు రూ.50 నుంచి రూ.60 ఇస్తున్నారు. గతంలో హమాలీ చార్జి ప్రభుత్వమే చెల్లించేది. దీంతో అన్నదాతపై కొంత భారం తగ్గేది. కానీ 2017 రబీ సీజన్ నుంచి ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధర క్వింటాల్కు గ్రేడ్ ఏ రూ. 2320, కామన్ రకం రూ.2300 చెల్లిస్తున్నారు. ఇందులో హమాలీలకు, సుతీలు, లారీలకు కలిపి రూ.50 రైతులే చెల్లిస్తున్నారు. కానీ లారీ యజమానులకు గిట్టుబాటు కాకపోవడంతో రైతుల వద్ద అదనంగా సంచికి రూ. 2 చొప్పున తీసుకుంటున్నారు.
ఊపందుకున్న కొనుగోళ్లు..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఊపందుకున్నాయి. సహకార సంఘాల ఆధ్వర్యంలో 263 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే, ఐకేపీ ఆధ్వర్యంలో 183 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ యాసంగిలో నాట్లు వేసిన వారం నుంచే మొగిపురుగు ఆశించి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంటు కాపాడుకునేందుకు రసాయన మందులు వాడారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టగా దిగుబడి అంతంతే వస్తుందని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఇప్పటివరకు 3.17 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు.
చేతులెత్తేసిన ప్రభుత్వం
గతంలో క్వింటాలుకు రూ.5.30 చొప్పున ప్రభు త్వం హమాలీలకు చెల్లించేది. మిగిలిన డబ్బులు రైతులు కలుపుకుని ఇచ్చేవారు. దీంతో అన్నదాతలకు కొంత ఊరట లభించేది. 2017 నుంచి ప్రభు త్వం చేతులెత్తేయగా, అప్పటి నుంచి రైతులపై భారం పడుతోంది. హమాలీలు ధాన్యం ఎత్తడం, తూకం వేయడం చేయాలి. పెరిగిన పెట్టుబడులకు మద్దతు ధర సరిపోతలేదని రైతులు వాపోతున్నారు.హమాలీ చార్జీలు పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో
తడిసి మోపెడవుతున్న ఖర్చులు
క్వింటాల్కు రూ.50 వరకు వసూలు
ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్న రైతులు
భవిష్యత్తులో జమ అవుతాయి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ప్రస్తుతం మద్దతు ధర జమ అవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేయగానే భవిష్యత్లో హమాలీ చార్జీలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. జూన్ 10 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయి.
– రామ్మోహన్రావు, డీసీవో, కామారెడ్డి
భారం తగ్గుతుంది
ఐదెకరాల్లో సన్నరకం వరి సాగు చేసి వారం రోజుల క్రితం పంటను కోశాం. వాతావరణ మార్పులు, తెగుళ్లతో ఈ సారి ఆశించిన దిగుబడి వచ్చేలా కనిపిస్తలేదు. ఎకరాకు రూ. 25 వేల పెట్టుబడి పెట్టాను. హమాలీలకు ప్రభుత్వం చెల్లిస్తే కొంత భారం తగ్గుతుంది.
–నారాయణ రైతు,బాన్సువాడ.