
యంగ్ ఇండియా స్కూల్ మంజూరు
బాన్సువాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైనట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో వివరాలను వెల్లడించారు. సుమారు రెండు వందల కోట్లతో నిర్మించనున్న స్కూల్ కోసం పొతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ గ్రామం సోంపూర్ శివారులో స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రభుత్వం ద్వారా టెండర్లు ఖరారు కాగానే పనులు పూర్తిచేయిస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు, ఈప్రాంత విద్యార్థులకు అమూల్యమైన వరం అందించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరితగతిన
పూర్తి చేయాలి
బాన్సువాడ నియోజక వర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రానున్న వానాకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలు, ఎరువులపై మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్ననేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ గోపితో పలు అంశాలపై చర్చించారు. పచ్చిరొట్ట విత్తనాలతో పాటు రైతాంగానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎరువుల కొరత రాకుండా చూడాలని సూచించారు. అలాగే బాన్సువాడలో నూతనంగా నిర్మించిన నర్సింగ్ కళాశాల మిగులు పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆర్ఆండ్బీ సీఈ రాజేశ్వర్కు సూచించారు. వ్యవసాయ ఆధారితమైన నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు చేపడుతన్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ను ఆదేశించారు. సుమారు రూ.258కోట్లతో ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్తో 14వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. ఈకార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గం సోంపూర్ శివారులో స్థలం ఎంపిక
వివిధ శాఖల అధికారులతో సమీక్షలో పోచారం శ్రీనివాస్రెడ్డి