
సమ్మెకు సై!
ఉపాధి హామీ సిబ్బంది సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పేస్కేల్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్కారు స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంటున్నారు. – నాగిరెడ్డిపేట
అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు (ఫైల్)
ఉపాధి హామీ పథకంలో జిల్లావ్యాప్తంగా 14 మంది ఏపీవోలు, తొమ్మిది మంది ఈసీలు, 65 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 328 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 40 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 22 మంది అటెండర్లు, ఎనిమిది మంది డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. టీఏలు మినహా ఇతర సిబ్బందికి మూడు, నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదు. నెలనెలా వేతనాలు అందకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. వేతనాలు సకాలంలో రాకపోవడంతో నెలనెలా చెల్లించాల్సిన ఈఏంఐలు చెల్లించలేకపోతున్నామని, దీంతో ఫైన్లు పడుతున్నాయని, సిబిల్ స్కోర్ సైతం పతనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో వేతనాలు అందేలా చూడాలని, పేస్కేల్ అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే సమ్మెకు వెళ్లేందుకూ వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు.
ఆందోళనలు..
ఉపాధి హామీ పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. గత నెల 29న కలెక్టర్తోపాటు డీఆర్డీవోలకు వినతి పత్రాలు అందించిన ఉద్యోగులు.. 30వ తేదీ నుంచి పెన్డౌన్, షట్ డౌన్తో సహాయ నిరాకరణ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. శనివారం మంత్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని పేర్కొంటున్నారు.
ఆందోళన బాటలో ఉపాధి సిబ్బంది
పేస్కేల్ అమలు.. పెండింగ్ వేతనాల
విడుదల డిమాండ్లతో..
కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు
సర్కారు స్పందించకపోతే సమ్మెకు
వెళ్తామంటున్న ఉద్యోగులు
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఉపాధి హామీ సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి. పే స్కేల్ అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. – కృష్ణాగౌడ్, ఉపాధిహామీ
ఉద్యోగుల జేఏసీ చైర్మన్, కామారెడ్డి

సమ్మెకు సై!