సుభాష్నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలు, మిస్సింగ్ డేటాను రుణమాఫీ పోర్టల్లో అప్డేట్ అయ్యేలా చూడాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని హైదరాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం రమేశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని సొసైటీల్లో సీబీలో నమోదు చేయని కారణంగా రుణమాఫీ వర్తించలేదని, ఆ రైతుల వివరాలను పోర్టల్లో అప్డేట్ చేసి రుణాలు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ కోదండరెడ్డి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా రుణమాఫీ అమలయ్యేలా చూస్తామని హామీనిచ్చారన్నారు. అంతకుముందు కోదండరెడ్డిని శాలువాతో సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, టీజీసీఏబీ ఎండీ కృష్ణారావు పాల్గొన్నారు.