జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు

May 3 2025 7:50 AM | Updated on May 3 2025 7:50 AM

జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు

జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు

కామారెడ్డి క్రైం: పైలట్‌ ప్రాజెక్టు జిల్లాలను మినహాయించి మే 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలం చొప్పున అన్ని జిల్లాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ రామకృష్ణారావు, సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. జూన్‌ 2 వరకల్లా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా జరిగే రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 15 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ భూములలో పొజిషన్‌ కలిగిన రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. భూమి లేని నిరుపేదలు పొజిషన్‌లో ఉంటే వారికి పట్టాలు ఇవ్వడానికి సీఎంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.

అసైన్డ్‌ భూములను విక్రయిస్తే..

తంలో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను ఎవరైనా విక్రయిస్తే ముందుగా ఆ పట్టాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి భూములను కొనుగోలు చేసిన వారు ఒకవేళ భూమి లేని నిరుపేదలైతే ఎంత భూమిని క్రమబద్ధీకరించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. మే 4న జరిగే నీట్‌ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్‌ పీఎం ఆవాస్‌ యోజన కింద లక్షా 13 వేల ఇండ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. 600 చదరపు గజాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు రావన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హౌజింగ్‌ శాఖ కోసం ప్రత్యేకంగా ప్రతి మండలానికి ఏఈలను కేటాయిస్తామన్నారు.

4,225 దరఖాస్తులు..

భూ భారతిలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసిన లింగంపేట్‌ మండలంలో 4,225 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. వీడియో కాన్ఫ రెన్స్‌లో సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్‌, చందర్‌, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్‌, హౌజింగ్‌ పీడీ జైపాల్‌రెడ్డి, భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్‌రెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, లింగంపేట తహసీల్దార్‌ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

5 నుంచి 20 వరకు..

వీసీలో రెవెన్యూ శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నీట్‌ పరీక్షను పకడ్బందీగా

నిర్వహించాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement