
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో 3,700 దరఖాస్తులు అందాయని వివరించారు. మొత్తం తొమ్మిది టీములను ఏర్పాటు చేశామని, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, సర్వేయర్ల టీముల్లో ఉంటారని, ఒక్కో టీము 400 దరఖాస్తులను పరిశీలించాలని టీములకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ సురేశ్కు సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.