
ముగిసిన టీఓటీల శిక్షణ
సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని టీఓటీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నేర్చుకున్న అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ–జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం–పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు కావసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సుశీల, కేఆర్ నీహారిక, ఎస్ఎస్ శర్మ, శ్రీనివాసరావు, ఎం.చక్రఫణిరావు పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు అందజేసిన వైస్ ప్రిన్సిపాల్