సీఎస్‌ఈకే క్రేజ్‌..! | - | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఈకే క్రేజ్‌..!

Jul 18 2025 5:26 AM | Updated on Jul 18 2025 5:30 AM

ఉమ్మడి తూర్పులో ఇలా...

ఇంజినీరింగ్‌ కళాశాలలు : 34

ప్రభుత్వ : 2

ప్రైవేటు : 32

మొత్తం సీట్లు : 17,250

సెట్‌లో అర్హత సాధించిన

విద్యార్థులు : 15,222

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌

ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ, అనుబంధ బ్రాంచ్‌ల) జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. కళాశాలల్లో ఏటా ఈ బ్రాంచి సీట్లే ఎక్కువగా భర్తీ అవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఉండటంతో ఎక్కువ మంది సీఎస్‌ఈపై మక్కువ చూపుతున్నారు. ప్రముఖ కంపెనీల్లో కొలువు సాధిస్తే రూ.లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయన్న ఆశతో సీఎస్‌ఈ బ్రాంచ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కోర్సులో చేరేందుకు అత్యధిక శాతం విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఏఐ, డేటాసైన్స్‌, ఎంఎల్‌ తదితర కోర్సులకు డిమాండ్‌ ఉంది. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్‌మెంట్‌ సీట్ల పరిమితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సీట్లు పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్‌ ఆప్షన్ల నమోదులో తలమునకలవుతున్నారు. ఏపీఈఏపీసెట్‌–2025 వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకూ జరగనుంది. 22న సీట్ల అలాట్‌మెంట్‌, 23న కళాశాలలో చేరిక, వచ్చే నెల 4న క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులు సీఎస్‌ఈ గ్రూప్‌నకే తమ వెబ్‌ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. రెండో ప్రాధాన్యంగా ఈసీఈ, ఏఐ కోర్సును ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కనీసం ఈ బ్రాంచ్‌లను పది శాతం మంది కూడా ఎంచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఈ నెల 19న జరిగే వెబ్‌ ఆప్షన్ల మార్పుల్లో సైతం ఇదే పంథా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లలో కన్వీనర్‌ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కాగా లభించే అవకాశం ఉంది.

యథేచ్ఛగా దోపిడీ

సీఎస్‌ఈకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు దోపిడీకి తెర తీశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌, డీమ్డ్‌, అటానమస్‌ ఇలా అన్ని ప్రైవేటు కళాశాలల్లో సీఎస్‌ఈ కన్వీనర్‌ కోటా సీట్లు తప్ప మేనేజ్‌మెంట్‌, పేమెంట్‌ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే విక్రయించేశారు. ఏఐసీటీఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ఆధారంగా ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నిస్తే సీటు ఇవ్వకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

కన్వీనర్‌ కోటాకే పథకాల వర్తింపు

కోర్సుల ఎంపికలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటున్నారు. అన్ని బ్రాంచిలూ ముఖ్యమైనవేనని, విద్యార్థుల అభీష్టం మేరకు కోర్సుల్లో చేరాలంటున్నారు.

కళాశాలల దోపిడీని అరికట్టాలి

ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీలో ప్రైవేటు కళాశాలలు దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా వర్శిటీ అధికారులు, ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు కళాశాలలకు సీట్ల కేటాయింపు విచ్చలవిడిగా పెంచడంతో ఇదే అదునుగా భావిస్తున్న కళాశాలలు.. విద్యార్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి.

– ఎంవీ బ్రహ్మానందరెడ్డి,

ఏపీటీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు

సీఎస్‌ఈ అంటున్నారు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 2, ప్రైవేటు 32 ఉన్నాయి. 15,222 మంది సెట్‌లో అర్హత సాధించారు. 17,250 ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతానికి పైగా సీఎస్‌ఈనే ఎంచుకునే పరిస్థితి ఉందని విద్యా నిపుణులు అంటున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో సీఎస్‌ఈ గ్రూప్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సీఎస్‌ఈ జనరల్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది.

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో

కంప్యూటర్‌ సైన్స్‌దే పైచేయి

సాఫ్ట్‌వేర్‌ రంగంలో డిమాండ్‌

ఉండటంతో విద్యార్థుల మొగ్గు

సొమ్ము చేసుకోవడానికి రంగంలోకి

దిగిన ప్రైవేటు కళాశాలలు

కౌన్సెలింగ్‌ జరుగుతుండగానే

విద్యార్థులను ఆకర్షించే యత్నాలు

మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి బేరసారాలు

70 శాతానికి పైగా సీఎస్సీ కోర్సు

ఎంచుకునే అవకాశం

కొత్త కోర్సులు

ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం కొత్త కోర్సులు పరిచయం అయ్యాయి. సీఎస్‌ఈలో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఆడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌, అగ్రికల్చర్‌, మైరెన్‌, మైనింగ్‌, స్కిల్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ వంటి కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

సీఎస్‌ఈకే క్రేజ్‌..!1
1/1

సీఎస్‌ఈకే క్రేజ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement