
పని గంటలు.. 10 గంటలా?
● కూటమి సర్కారుపై కార్మిక
సంఘాల ఆగ్రహం
● కలెక్టరేట్ వద్ద ధర్నా
● కనీస వేతనం రూ.26 వేలు
ఇవ్వాలని డిమాండ్
కాకినాడ సిటీ: రాష్ట్రంలో కార్మిక హక్కులను కాలరాసే విధంగా పని గంటలను పెంచుతూ కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఏ రంగంలో పని చేసే కార్మికులకై నా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చివుకుల వెంకటరావు, తోకల ప్రసాద్, జె.వెంకటేశ్వర్లు, తాళ్లూరి రాజు, గొడుగు సత్యనారాయణ, వల్లూరి రాజబాబు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అవహేళన చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పని గంటలను పెంచుతూ అసెంబ్లీలో చేసిన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పది గంటల పని విధానం అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరమే 12.50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. పది గంటల పని గంటల విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులందరూ కార్మికులతో కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు పగటి పూటనే రక్షణ కల్పించలేని కూటమి సర్కారు శ్రామిక మహిళలతో రాత్రి వేళల్లో పని చేయించడం మానుకోవాలని అన్నారు. అధిక పని గంటలు కార్మికుల పాలిట యమపాశాలని అనేక శాసీ్త్రయ పరిశోధనలు ఘోషిస్తున్నా చంద్రబాబు చెవికెక్కడం లేదని దుయ్యబట్టారు. పారిశ్రామిక మిత్రుల ప్రయోజనాలే కూటమి పెద్దలకు ముఖ్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరించలేదని, తక్షణం సలహా మండలిని నియమించి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.26 వేలు చేయాలని కోరారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చే నాలుగు లేబర్ కోడ్ల అమలును రాష్ట్రంలో నిలుపు చేయకపోతే కార్మిక వర్గం ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కూటమి నేతలను హెచ్చరించారు. ధర్నాలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చెక్కల రాజ్కుమార్, మలకా వెంకటరమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్కుమార్, నక్కా గంగాధర్, దుంపల ప్రసాద్, గుబ్బల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.