
విధి నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు/కోదాడ రూరల్: కర్తవ్య నిర్వహణే ప్రథమ ధర్మం అంటారు. ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆ ఉద్యోగులు శాశ్వత విశ్రాంతిని పొందారు. మాదక ద్రవ్యాల (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఓ ఎస్సై, ఓ కానిస్టేబుల్ అసువులు బాసారు.
వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నాడన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాక్ను సొంతం చేసుకున్న ఎస్సై అశోక్ బుధవారం రాత్రి పది గంటలకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామితో కలిసి నిందితున్ని అరెస్ట్ చేసేందుకు డ్రైవర్ జి.రమేష్ను వెంటబెట్టుకుని ఎర్టిగా కారులో హైదరాబాద్కు బయల్దేరారు. మార్గమధ్యలో డ్రైవర్ తనకు నిద్రవస్తోందని చెప్పడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వైపు గంటన్నరపాటు కారు పక్కకు ఆపి నిద్రించారు.
బయల్దేరిన 10 నిమిషాలకే..
కొద్దిసేపటి తర్వాత వీరు తిరిగి హైదరాబాద్కు బయల్దేరగా.. ఆ తర్వాత పది నిమిషాలకే కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్లో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు.
కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామి తీవ్ర గాయాలతో బయట పడ్డారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా, అక్రమార్కులకు సింహస్వప్నంగా, రక్షణ కోసం వచ్చిన వారికి ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ మృతితో అంతటా విషాదం అలముకుంది.
కారులో ఇరుక్కుపోయిన ఎస్ఐ మృతదేహం
లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగంలో కూర్చున్న ఎస్ఐ మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. కోదాడ పోలీసులు కారు భాగాలను తొలగించి అతికష్టం మీద ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. అయితే పోలీసులు లారీని పట్టుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
కోనసీమ ఏఎస్పీ, కోదాడ డీఎస్పీ నివాళులు
కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతదేహాలకు కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను ఏపీ పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు.
పదోన్నతి వస్తుందనుకునే లోపే..
ఎస్సై అశోక్కు ఈ ఏడాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు.
అశోక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నరసాపురంలోని అశోక్ నివాసంలో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
విధి నిర్వహణలో ఎస్సై అశోక్కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్ బ్లెసన్ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్ ఆదిత్య, అలెక్స్ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బ్లెసన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గంజాయి రవాణా నిందితుడి
అన్వేషణలో దుర్ఘటన

విధి నిర్వహణలో విగతజీవులై..

విధి నిర్వహణలో విగతజీవులై..