
ఆమోదిస్తే బాక్స్ బద్దలే..
● పిఠాపురం మున్సిపాలిటీలో
టెండర్ల బాగోతం
● రూ.3 కోట్లతో వివిధ పనులకు అనుమతి
● కూటమి నేతలకు కలిసొచ్చేలా వ్యూహం
● నిబంధనలకు విరుద్ధంగా
జిల్లా అధికారి ఆదేశాలు
● వ్యతిరేకిస్తున్న పాలకవర్గం
పిఠాపురం: ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాన్ని పక్కన పెట్టేసి, కూటమి నేతలకు కలిసొచ్చేలా జిల్లా అధికారి ఒకరు ఇచ్చిన ఆదేశాలు పిఠాపురం మున్సిపాలిటీలో రచ్చ రేపుతున్నాయి. ఏకంగా రూ.3 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై కూటమి నేతలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను పాలకవర్గం అడ్డుకుంటోంది. వివరాలివీ.. పట్టణంలో తాగునీటి సరఫరా, డ్రైన్లు, రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి రూ.3 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. రోడ్ల అభివృద్ధికి రూ.1.48 కోట్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.1.51 కోట్లు కేటాయించారు. ఈ నిధులు తరువాత సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు కౌన్సిల్ గత నెలలో ఆమోదం కూడా తెలిపింది.
నిబంధనల ఉల్లంఘన ఇలా..
ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం రూ.లక్షకు మించి ఏ పని చేపట్టాలన్నా ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్లో టెండర్లు పిలవాలి. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పోటీ పడి, తక్కువ రేటుకే పనులు చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రజాధనం మిగిలే అవకాశం ఉంటుంది. కానీ, ఏం ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, మున్సిపల్ పాలకవర్గాన్ని అధికారులు పూర్తిగా పక్కన పెట్టి, కూటమి నేతలకు అనుకూలంగా ఉండేలా ఆఫ్లైన్ టెండర్ల విధానాన్ని తెర పైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (కాంట్రాక్టర్లు తమ కొటేషన్లను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేయడం వలన దీనిని బాక్స్ టెండర్లు అని పిలుస్తున్నారు.) ఇందులో భాగంగా ఈ పనులను రూ.5 లక్షల్లోపు ఉండేలా విడగొట్టారు. రోడ్ల పనులు 8, డ్రైన్ పనులు 31 పనులకు బాక్సు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులను కూటమి నేతలకు కట్టబెట్టేందుకే అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారంటూ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
ఉన్నతాధికారుల హెచ్చరిక
జిల్లా అధికారి లిఖితపూర్వకంగా ఆదేశించారని పేర్కొంటూ బాక్సు టెండర్ల స్వీకరణకు అనుమతించాలని పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులను అభ్యర్థించారు. అయితే, దీనికి ఉన్నతాధికారులు నిరాకరించారని తెలిసింది. టెండర్లలో నిబంధనలు పాటించకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించిన వారు.. ఈ–ప్రొక్యూర్మెంటు విధానంలోనే టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు తెలిసింది. అయినప్పటికీ, జిల్లా అధికారి ఆదేశాల మేరకు బాక్సు టెండర్ల ద్వారానే పనులు కేటాయించేందుకు మున్సిపల్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పాలక వర్గ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గాన్ని కాదని, కూటమి నేతలకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలపై పోరాడాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అటు మున్సిపల్ ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు బాక్సు టెండర్లను వ్యతిరేకించడం.. ఇటు జిల్లా అధికారి ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక పిఠాపురం మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో తాము ఏ పనీ చేయలేమంటూ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.