
అదనపు మందుల కౌంటర్ల ఏర్పాటు
● ల్యాబ్ రిపోర్టులు త్వరితగతిన
అందేలా చర్యలు
● జీజీహెచ్లో పర్యటించిన సూపరింటెండెంట్
కాకినాడ క్రైం: ‘పెద్దాసుపత్రికి సుస్తీ’ శీర్షికన ఈ నెల 25న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి కాకినాడ జీజీహెచ్ అధికారులు స్పందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శుక్రవారం ఆసుపత్రిలో పర్యటించారు. మందుల పంపిణీ పేద రోగులకు ప్రహసనంగా మారిందన్న విషయం తెలుసుకున్న ఆమె.. ప్రస్తుతం ఉన్న 8 కౌంటర్లకు అదనంగా మరో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మందులు పంపిణీ చేసే కౌంటర్ల సంఖ్య 16కి పెరిగింది. అలాగే, వైద్య పరీక్షల నివేదికలు సకాలంలో అందించేందుకు పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాధిపతులతో చర్చించారు. అనంతరం జీజీహెచ్లో హిమోఫీలియా, తలసేమియా, సికిల్సెల్ బాధితులకు ఐదు పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. వారి సేవలకు పీడియాట్రీషియన్, ఫిజీషియన్తో పాటు ఒక స్టాఫ్ నర్సును నియమించారు. వివిధ వార్డుల్లో పర్యటించిన డాక్టర్ లావణ్య కుమారి వైద్య సేవల నాణ్యతను రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, డీసీఎస్ ఆర్ఎంవో మెహర్ కుమార్ పాల్గొన్నారు.

అదనపు మందుల కౌంటర్ల ఏర్పాటు