
వంచనపై.. జనం బాట
● హామీలు అమలు చేయని కూటమి సర్కారుపై ప్రజల్లోకి వైఎస్సార్ సీపీ
● ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరిట ప్రచారం
● చంద్రబాబు, పవన్ మోసాలను
ఎండగట్టాలని నేతల పిలుపు
● ఐదు వారాల పాటు చైతన్య కార్యక్రమాలు
● త్వరలో పార్టీ నియోజకవర్గ స్థాయి
సమావేశాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల వేళ అలవి కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పచ్చి దగా చేస్తున్న కూటమి సర్కారు తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. చంద్రబాబు అండ్ కో ఎడాపెడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన ఏడాది కాలంలో ఏమేరకు నష్టపోయారో ప్రజలకు వివరించనుంది. ఈ మేరకు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనే సరికొత్త కార్యక్రమం చేపట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ సూర్య కళా మందిరంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా నలుమూలల నుంచీ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి ఉత్సాహంగా తరలివచ్చారు. తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి, నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు.
చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మండల, గ్రామ స్థాయిల్లో చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ ఆయన మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ప్రజల మద్దతు కూడగట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల చిట్టా, జూన్ 24 నుంచి అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కాక మొదటి ఏడాది హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేయడాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మనందరి పైనా ఉందనే విషయాన్ని ప్రజల ముందుంచాలని అన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పెన్షన్ వంటి అంశాలతో పాటు ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న తీరును వివరించాలని నేతలు పిలుపునిచ్చారు.
అధినేత వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా పార్టీ రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రతి కార్యకర్తా తన మొబైల్తో ఈ కోడ్ను స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టో వస్తుందని, అందులో చంద్రబాబు హామీలు, చేసిన మోసాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు వీలుగా తొలుత పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బొత్స సూచించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తామంతా అండగా ఉంటామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తకర స్థాయిలో అమలు చేసిన వైఎస్ జగన్ పేరు నేతల ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జై జగన్ నినాదాలతో సమావేశ ప్రాంగణం మార్మోగిపోయింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అనంత బాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జ్యోతుల చంటిబాబు, పార్టీ జగ్గంపేట, పెద్దాపురం కో ఆర్డినేటర్లు తోట నరసింహం, దవులూరు దొరబాబు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ ప్రసన్న, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యా సాగర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, బెహరా రాజరాజేశ్వరి, పార్టీ నేతలు వాసిరెడ్డి జమీలు, తోట రాంజీ, ఉలవకాయల లోవరాజు, యనమల కృష్ణుడు, గుల్లా ఏడుకొండలు, గండేపల్లి బాబీ, అల్లి రాజబాబు, అనసూరి ప్రసాద్, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల కుమార్రాజా, ఒమ్మి రఘురామ్, నాగం గంగబాబు, రోకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వంచనపై.. జనం బాట