
జీవితాలు మారడమంటే.. ఇదా!
‘నేను అధికారంలోకి వస్తే మీ జీవితాలు మారిపోతాయి’ అని పవన్ కల్యాణ్ చెప్తే నమ్మామని.. జీవితాలు మారడమంటే మాకున్న ఉపాధిని ఊడగొట్టడమా అని ఎండీయూ ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న కూటమి సర్కారు ఇప్పుడు తమను నట్టేట ముంచుతున్నా.. పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితాలు మారడమంటే ఇలా తలకిందులు చేయడమా అని ప్రశ్నిస్తున్నారు.
పిఠాపురం: ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9,760 వాహనాల సేవలు నిలిచిపోనున్నాయి. దీనిని నమ్ముకుని బతుకుతున్న దాదాపు 18 వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా కూడా 428 రేషన్ వాహనాలున్నాయి. ఒక్కో వాహనానికి డ్రైవర్, ఆపరేటర్, హెల్పర్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా 1,284 మంది ఉపాధి పొందుతున్నారు. సర్కారు నిర్ణయంతో వీరి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. రేషన్ వాహనాల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎండీయూ ఆపరేటర్లు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రేషన్ వాహనాలు నిలిపివేయాలనే నిర్ణయం బడుగు, బలహీన వర్గాల మీద కూటమి ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యేనని పేర్కొంటున్నారు. లక్షల మందికి నేరుగా రేషన్ అందించే ఈ వ్యవస్థను రద్దు చేయడం పేదలను ఇబ్బంది పెట్టడమేనని అంటున్నారు. వైఎస్సార్ సీపీపై ఉన్న కోపంతో ఈ మంచి కార్యక్రమాన్ని రద్దు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టిస్తామని, పేదలకు ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి, ఓట్లేయించుకుని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులపై కక్ష కట్టినట్లు.. ఉన్న ఉపాధి, ఉద్యోగాలు రద్దు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోతే.. రేషన్ వాహనదారులే బాధితులకు అన్నపానీయాలు అందించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి సేవలను రద్దు చేయడమేమిటని, ప్రభుత్వం పునరాలోచించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ బతుకు తల్లకిందులు చేస్తారా!
ఫ నట్టేట ముంచుతారా!
ఫ పవన్.. మా పొట్ట కొట్టొద్దు
ఫ ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన