
నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి
తొండంగి: రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. తొండంగి మండలం కోదాడలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించి, రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో రైతులందరూ గిట్టుబాటు ధర కోసం వేచి ఉన్నారని, ఈ పరిస్థితుల్లో కురిసిన అకాల వర్షాలకు ధాన్యపు రాశులు ముంపుబారిన పడ్డాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు పండించిన ధాన్యానికి బస్తాకు రూ.2 వేల మద్దతు ధర కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో బస్తా ధాన్యం రూ.1,250కి కూడా కొనే నాథుడు లేడన్నారు. దీంతో రోడ్లపై రాశులుగా పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారన్నారు. ప్రభుత్వం తూతూమంత్రంగా ధాన్యం సేకరించి, రైతుల కష్టాలను పూర్తిగా గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. జగన్ పాలనలో తడిసిన ధాన్యాన్ని, మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి కొద్ది రోజుల్లోనే పరిహారం అందించిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనను రైతులకు చీకటి పాలనగా భావించాల్సి ఉందని అన్నారు. తిరుపతి, సింహాచలం ఘటనల కారణంగా రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శించుకోవాలంటేనే భక్తులు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించాలని రాజా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, వైఎస్సార్సీపీ బూత్ కమిటీ వింగ్ రాష్ట ప్రధాన కార్యదర్శి బెక్కం చంద్రగిరి, కోదాడ సర్పంచ్ బూర్తి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఫ మద్దతు ధర చెల్లించి..
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
ఫ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్