
రాములోరి భూముల్లో రావణాసురులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాములోరి భూముల్లో రావణాసురులు చొరబడ్డారు. పిఠాపురం రాజా హయాంలో భద్రాచల రాముడిని పోలిన పంచలోహ విగ్రహంతో పిఠాపురం నియోజకవర్గం గోర్స గ్రామంలో రామాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్వహణ కోసం నాడు 30 ఎకరాలు దానం చేశారు. ధూపదీప నైవేద్యాల కోసం నాడు సర్వే నంబర్ 121, 122లో గోర్సలో 19.92, కుతుకుడుమిల్లిలో సర్వే నంబర్ 142/1లో 4.89 ఎకరాలు, 142/2లో 6.25 ఎకరాలు ఉన్నాయి. గోర్సలోని 19.92 ఎకరాలను కండేపల్లి నాగన్న, అప్పన్న కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. దేవదాయశాఖ అధీనంలో ఉన్న ఈ భూములకు రెండేళ్లకు ఒకసారి వేలం నిర్వహించేవారు. కాలక్రమంలో దేవదాయశాఖ అధికారులతో కొందరు ఆక్రమణదారులు కుమ్మకై ్క రికార్డులు తారుమారు చేసి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2008కి ముందు తొమ్మిది మంది ఆక్రమణలో ఉన్న గోర్స భూములు కాలక్రమంలో 20 మంది, ప్రస్తుతం 34 మంది చేతుల్లోకి పోయాయి. రెవెన్యూ అధికారులు ముడుపులు మెక్కి ఈ భూములపై పాస్పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఆన్లైన్లో కూడా నమోదు చేయించారు. ఆక్రమణదారులు దేవస్థానం భూములను అల్లుళ్లకు కట్న కానుకలుగా కూడా ధారాదత్తం చేసేయడంతో చేతులు మారాయి. ఆక్రమణలో ఉన్న గోర్స భూముల కోసం పాతికేళ్ల క్రితం గ్రామస్తుడు నామాలస్వామి న్యాయ పోరాటంలో మొదలు పెట్టారు. అయితే వయసు మీదపడటంతో అలసిపోయారు. అయినా రాములోరి భూముల కోసం పోరాటాన్ని గ్రామస్తులు విడిచిపెట్ట లేదు. స్థానికులకు 2013లో హిందూ ధర్మరక్షణ సమితి సభ్యులు కూడా తోడయ్యారు.
ముడుపులు ముట్టజెపుతూ..
ఇప్పుడు ఆ భూమి ఎకరం రూ.కోటి పైనే పలుకుతోంది. రెండు పంటలు.. అవసరాన్ని బట్టి మూడో పంట కూడా సాగు చేస్తుంటారు. మిగిలిన గ్రామాల్లో భూములకు ఇబ్బంది లేకున్నా ఒక్క గోర్స గ్రామంలో మాత్రమే కూటమి నేతల కబ్జాలో ఉన్నాయి. గోర్సలో సారవంతమైన రాములోరి భూములు ఆక్రమించుకున్న కబ్జాదారులు వాటిని కాపాడుకునేందుకు వేర్వేరు పార్టీల్లో ఉన్న వారు కూటమిగా జత కట్టిన తెలుగుదేశం, జనసేన పార్టీల పంచన చేరారు. ఇరుపార్టీలకు చెందిన నాయకులు, అనుచరుల ఆక్రమణలోనే ఈ భూములుండగా అధికారులకు అడిగినంతా ముడుపులు ముట్టజెపుతూ పబ్బం గడుపుతున్నారు. రూ.కోట్లు విలువ చేసే ఆ భూముల కోసం పాతికేళ్లుగా గ్రామస్తులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ భూముల కోసం 2008లో అప్పటి దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు గ్రామస్తులు చేసిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించి ఆ భూమి దేవస్థానానికి చెందినదిగా నిర్ధారించారు. అడంగల్ ప్రకారం వెంటనే భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆ భూమికి అక్రమంగా సృష్టించిన పాస్ పుస్తకాలతో పాటు ఆక్రమణదారులు అనధికారంగా సంపాదించిన హక్కుల రద్దుకు ఆదేశాలు జారీచేశారు. భూమిని అనుభవిస్తున్న వారు హైకోర్టులో వేసిన కేసు వీగిపోవడంతో తిరిగి ట్రిబ్యునల్కు వెళ్లారు. ఈ క్రమంలో 2023లో వైఎస్సార్ సీపీ తీసుకువచ్చిన జీవో ప్రకారం దేవస్థానం భూములు తిరిగి దేవస్థానాలకే అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టు జిల్లా ఉన్నతాధికారులు భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఉప ముఖ్యమంత్రి పవన్కు
విన్నవించినా దక్కని ఫలితం
ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాములోరి భూములు కబ్జాచేసిన వారు ఆ పార్టీ పంచన చేరారు. జనసేన, తెలుగుదేశం పార్టీల అండతో దేవదాయ శాఖాధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఆక్రమణలో ఉన్న భూములు కాపాడుకుంటున్నారు. భూములకు ఆక్రమణ చెర వీడేలా ఆదేశాలు ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు. పవన్ ఆదేశాలతో ఈ నెల 4న భూములు అప్పగిస్తున్నామంటూ అధికారుల సమాచారంతో స్థానికులు రామాలయం వద్దకు వచ్చినా కుంటిసాకులతో మళ్లీ వాయిదా వేశారు. స్థానికులు ఈ నెల 25న కొత్తపల్లి వచ్చిన పవన్కల్యాణ్కు అడ్డంపడి మరోసారి వినతిపత్రం అందజేశారు. అయినా అతీగతీ లేదని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. న్యాయస్థానాల్లో అనుకూలంగా తీర్పులు వచ్చినా, ఉప ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం దక్కక పోవడానికి ఆక్రమణదారులైన కూటమి నేతలు తెర వెనుక చక్రం తిప్పడమే కారణమంటున్నారు. సనాతన ధర్మం కోసం కాషాయకండువాలతో దీక్షలు చేసిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చినా భూములకు మోక్షం కలగలేదంటే ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన గోర్స రామాలయం భూములు చెర వీడుతాయనే నమ్మకం కలగడం లేదంటున్నారు. కూటమి నేతలు ఒత్తిళ్లతోనే రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గోర్స గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా రాములోరి భూములకు చెర విడిపించాలని స్థానికులు కోరుతున్నారు.
‘పవన్’కు చెప్పినా పనికాలేదు
రూ.20 కోట్ల స్థిర ఆస్తులు
చెరపట్టిన వైనం
కూటమి పంచన ఆక్రమణదారులు
గోర్సలో పాతికేళ్లుగా పోరాటం
అధికారుల చర్యలు శూన్యం
న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా రాముని భూములు కబ్జాదారుల చెర వీడటం లేదు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు పోరాటాలు చేస్తున్నారు. దేవదాయశాఖ అధికారులకు అన్నీ తెలిసినా ఆచరణలోకి వచ్చేసరికి భూములు తిరిగి స్వాధీనం చేసుకోకపోవడం అన్యాయం. దాదాపు పాతికేళ్లుగా ఆందోళన చేస్తున్నాం. ఈ విషయం మా ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాం. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయినా ఇంతవరకు భూములు దేవదాయశాఖకు దఖలు పడేలా అధికారుల నుంచి చర్యలు కనిపించ లేదు.
– అయినంపూడి సత్యనారాయణరాజు, భూముల ఉద్యమ కార్యాచరణ నేత, గోర్స, ఉప్పాడ కొత్తపల్లి
కబ్జాదారులకు వత్తాసు
భూములు దేవదాయశాఖకు దఖలు పరిచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగాం. న్యాయం జరిగిందనుకుంటున్న తరుణంలో యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గోర్స రాములవారి ఆలయ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం తీరని వేదనకు గురిచేస్తోంది. భూములను కబ్జాచేసి అనుభవిస్తున్న వారికి కొందరు వత్తాసు పలుకుతూ గ్రామానికి అన్యాయం చేస్తున్నారు. ఇది చూస్తూ ఎవరూ ఉపేక్షించరు.
– రొంగల వీరబాబు, గ్రామ సర్పంచ్, గోర్స, ఉప్పాడ కొత్తపల్లి

రాములోరి భూముల్లో రావణాసురులు

రాములోరి భూముల్లో రావణాసురులు

రాములోరి భూముల్లో రావణాసురులు

రాములోరి భూముల్లో రావణాసురులు