
అక్రమ కేసులకు బెదరొద్దు
తుని రూరల్: చంద్రబాబు నాయుడి ఏడాది పాలన అక్రమ కేసుల నమోదుకే సరిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. దీనికి బెదరాల్సిన పని లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని, కేసులు ఎత్తివేయకపోతే న్యాయ పోరాటం చేద్దామని అన్నారు. పార్టీ నాయకత్వం న్యాయ సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారని అన్నారు. జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అప్పుడు అక్రమ కేసులు పెట్టిన నాయకులు, హామీలిచ్చిన నాయకులు పారిపోయే రోజులు వస్తాయని చెప్పారు. మూడు రోజుల మహా డ్రామా నడిచిందని, జగన్మోహన్రెడ్డిని తిట్టడమే అజెండాగా కడపలో టీడీపీ మహానాడు నిర్వహించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం తలసరి ఆదాయంలో మొదటి ఐదు స్థానాల్లో నిలవగా ఇప్పుడు అధ్వానంగా ఉందని రాజా చెప్పారు. వైద్య విద్యను ఖరీదైనదిగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జగన్ నాయకత్వంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వైద్య కళాశాలను రూ.500 కోట్లతో నిర్మిస్తే వాటిని తన అనుయాయులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు రూ.5 వేలకే అద్దెకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని అన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉంటే ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. మద్యం అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే, డిస్టిలరీలన్నీ టీడీపీ నాయకులకు చెందినవే ఉన్నాయని అన్నారు. రోజులో ఎక్కువ సమయాన్ని వైఎస్సార్ సీపీ పటిష్టత కోసమే అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేటాయిస్తున్నారన్నారు. నమ్మకంగా పని చేస్తున్న కార్యకర్తలకు పార్టీ పదవులు అప్పగిస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని రాజా స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు చోడ్రాజు రాంబాబురాజు, రాయి మేరీ అవినాష్, నాగం దొరబాబు, లంక కృపానందం, డొంక వెంకట బెనర్జీ, కీర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కార్యకర్తలకు అండగా ఉంటాం
ఫ న్యాయ పోరాటం చేద్దాం
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా