
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా ఆలయానికి రూ.3,34,407 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
36 యూనిట్లకు
రూ.1.28 కోట్ల రాయితీలు
కాకినాడ సిటీ: సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహ రాయితీల కింద ఉత్పాదన, సేవా రంగాల్లోని 36 యూనిట్లకు సుమారు రూ.1.28 కోట్ల మేర రాయితీలు కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని జూమ్ ద్వారా శనివారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడచిన మూడు నెలల్లో వివిధ పరిశ్రమల స్థాపనకు 386 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 333 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. మిగిలిన 53 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హత కలిగిన క్లస్టర్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం (ఎంఎస్ఈసీడీపీ) కింద జిల్లాలో ప్రతిపాదించిన మ్యాంగో జెల్లీ క్లస్టర్ ప్రతిపాదనలను జూన్ నెలాఖరుకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి, ఏడీ ఎస్.విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి జీవీ శివరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ, ఎల్డీఎం సీహెచ్వీ ప్రసాద్, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఐటీఐలలో ప్రవేశాలకు
3 నుంచి ఇంటర్వ్యూలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం జూన్ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎం.వేణుగోపాలవర్మ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన షెడ్యూలు ప్రకారం హాజరు కావాలని సూచించారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మెరిట్ నంబర్లు 1 నుంచి 80 వరకూ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 81 నుంచి 159 వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 160 – 242 వరకూ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 243 – 325 మెరిట్ లిస్ట్ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. పైన పేర్కొన్న షెడ్యూల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి జనరల్ కేటగిరీలో జూన్ 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటలకు మెరిట్ లిస్ట్ 1 – 159, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 160 – 325 వరకూ, 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 326 – 484 వరకూ, మధ్యాహ్నం 485 నుంచి 634 వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయని వేణుగోపాలవర్మ వివరించారు.
కూటమి పాలనలో
విలేకర్లపై పెరిగిన దాడులు
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో విలేకర్లపై దాడులు పెరిగిపోయాయని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. అయినవిల్లి మండల సాక్షి విలేకరి బావిశెట్టి నాగేశ్వరరావుపై అయినవిల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు ముసుగులు ధరించి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు. అమలాపురంలో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావును ఆయన శనివారం పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి విలేకరిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావును వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజవర్గ ఇన్చార్జి గన్నవరం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైఎస్సార్ సీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెండగుదిటి శిరీష్, విఘ్నేశ్వరస్వామి ఆలయం మాజీ చైర్మన్ గుత్తుల నాగబాబు, నాయకులు సలాది బుచ్చిరాజు, మద్దాల చంటిబాబు, గుర్రాల రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు.