
‘మీ ప్రేమకు కృతజ్ఞతలు’
కిర్లంపూడి: తమ కుటుంబంపై ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన గురువారం లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంపై వెలకట్టలేని, కల్మషం లేని ప్రేమాభిమానాలు చూసి చలించిపోయానని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన ప్రజల చెంతకు తాను రాలేకపోయానన్నారు. నియోజకవర్గం ప్రజలతో తమ కుటుంబానికి ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, ఇప్పటికీ అదే ప్రేమ చూపించడం తమ అదృష్టమని అన్నారు. ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజల సేవకు తమ కుటుంబం మనస్ఫూర్తిగా అంకితమవుతుందని ముద్రగడ పేర్కొన్నారు. నిరసన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
నేటి నుంచి డీఎస్సీ
జిల్లాలో 41,017 మంది దరఖాస్తు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): డీఎస్సీ–25 పరీక్షలు శుక్రవారం నుం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 41,017 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద అయాన్ డిజిటల్ కేంద్రం, కాకినాడ రూరల్ రాయుడుపాలెం సెంటర్ సాఫ్ టెక్నాలజీ, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్, ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల్లో ఆరు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం 87 మంది స్క్రైబ్లను నియమించామని జిల్లా విద్యా శాఖాధికారి పి.రమేష్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం 94925 16116 (అసిస్టెంట్ డైరెక్టర్), 77996 98462 (సూపరింటెండెంట్), 79897 50963 (సీనియర్ అసిస్టెంట్) హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
కార్మిక శాఖ సహాయ
కమిషనర్గా శ్రీనివాస్ మహేష్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ కాకినాడ సహాయ కమిషనర్గా పి.శ్రీనివాస్ మహేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో కార్మిక శాఖ కమిషనర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన ఎస్.బుల్లిరాణి కొవ్వూరు బదిలీ అయ్యారు.
సమష్టి కృషితోనే
ఎన్బీఏ గుర్తింపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమష్టి కృషితోనే జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్బీఏ) యూజీ స్థాయి గుర్తింపు వచ్చిందని జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మోహనరావు అధ్యక్షతన అలుమ్నీ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీటెక్ కోర్సులైన ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్ విభాగాలను ఎన్బీఏ బృందం గత నెలలో సందర్శించిందని, ఈ గుర్తింపు 2028 వరకూ ఉంటుందని చెప్పారు. పీజీ ప్రోగ్రామ్కు ఎన్బీఏ గుర్తింపు వచ్చేలా ఇదే తరహాలో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వరూపరాణి, ఆర్.దీక్షితులు, వివిధ విభాగాల అధిపతులు కోటేశ్వరరావు, కె.వెంకటరెడ్డి, ఆర్.మధు, ఎస్.సురేఖ, కల్యాణ్ మనోహర్, సత్యవేణి పాల్గొన్నారు.

‘మీ ప్రేమకు కృతజ్ఞతలు’