మోసానికే ప్రాధాన్యం! | - | Sakshi
Sakshi News home page

మోసానికే ప్రాధాన్యం!

Jun 8 2025 12:13 AM | Updated on Jun 8 2025 12:13 AM

మోసాన

మోసానికే ప్రాధాన్యం!

ఖరీఫ్‌ పెట్టుబడి ఎలా?

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా రైతులకు కూటమి సర్కారు ఇప్పటి వరకూ ఎటువంటి పథకాలూ అమలు చేయలేదు. దీనికితోడు ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరపకపోవడం.. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్‌ పంట సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం తమను నెట్టేసిందని వాపోతున్నారు. అప్పుల కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం బకాయిలు విడుదల చేసి, తమకు అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలని వారు కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, త్వరలోనే రైతులకు డబ్బులు జమవుతాయని వ్యవసాయ శాఖ పిఠాపురం సహాయ సంచాలకులు పి.స్వాతి చెప్పారు.

పిఠాపురం: ఒకవైపు ముందస్తు సాగు పేరుతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల ఆరంభించారు. మరోవైపు ఖరీఫ్‌ పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు, ఆకుమడుల తయారీకి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సాగు పెట్టుబడి దొరికే దారి కానరాక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరించి విధానాలు తమను కష్టాల్లోకి నెట్టేశాయని వాపోతున్నారు.

ఏం జరిగిందంటే..

గడచిన రబీలో జిల్లావ్యాప్తంగా 1.45 లక్షల మంది రైతులు 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 5.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 225 కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మొత్తం 15,200 మంది రైతుల నుంచి 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.310 కోట్లు. ప్రభుత్వం ఇప్పటి వరకూ రైతులకు రూ.250 కోట్ల మేర చెల్లించింది.

గొప్పలు చెప్పి.. తిప్పలు పెట్టి..

కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఎంతో గొప్పగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రోజులు, నెలల తరబడి ధాన్యం సొమ్ములు జమయ్యేవి కావని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో చెల్లిస్తున్నామని ఊదరగొట్టారు. తీరా చూస్తే క్షేత్ర స్థాయిలో కొంత మందికి మాత్రమే ధాన్యం సొమ్ము జమ చేశారు. మిగిలిన వారికి రోజులు, వారాల తరబడి పెండింగ్‌లో పెట్టారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం రూ.60 కోట్లు పైగా ధాన్యం సొమ్ము బకాయి పెట్టింది.

దళారులపాలు చేసి..

మరోవైపు ధాన్యంలో తేమ 22 శాతం వరకూ ఉన్నా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని ప్రభు త్వం ఎంతో ఘనంగా చెప్పింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఆవిధంగా జరగలేదు. దీంతో, రోజుల తరబడి ధా న్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. అదే సమయంలో అ కాల వర్షాలు కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తేమ శాతం నిబంధనలను సడలించకపోవడంతో ఎక్కువ మంది రైతులు గత్యంతరం లేక దళారులకే.. అది కూడా వారు చెప్పిన తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. ఈవిధంగా సుమారు 4.33 లక్షల మె ట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎకరానికి రూ.20 వేల వరకూ నష్టపోయారు. మొత్తం మీద ఇటు కొన్న ధా న్యానికి డబ్బులివ్వకుండా.. అటు దళారులకే నష్టానికి ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతు లు ఈ ఏడాది దారుణంగా నష్టాలు చవి చూశారు.

24 గంటలన్నారు.. నెల రోజులువుతున్నా అందని ధాన్యం సొమ్ము

జిల్లాలో రూ.60 కోట్లకు పైగా బకాయి

ఖరీఫ్‌ పెట్టుబడులకు డబ్బుల్లేక రైతుల ఆందోళన

ప్రభుత్వ విధానాలతో రైతుకు నష్టం

రైతులు సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతూంటారు. కానీ రాష్ట్రంలోని అన్నదాతలు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల నష్టపోయారు. జిల్లాలోని రైతులు 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం 1.30 లక్షల మెట్రిక్‌ టన్నులు. దీనికి కూడా డబ్బులివ్వకుండా రైతులకు నరకం చూపిస్తున్నారు. గత నెల 8వ తేదీ వరకూ కొందరికి ధాన్యం డబ్బులు వేసిన ప్రభుత్వం.. ఆ తరువాత నుంచి ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు డబ్బుల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ధాన్యం బకాయిలపై జిల్లా అధికారులతో మాట్లాడితే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. రైతులకు ఇవ్వడానికే డబ్బుల్లేపోతే ఇక వ్యవసాయం ఎలా సాగుతుంది? ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోతే ఎలా? 24 గంటల్లో డబ్బులు వేయిస్తామన్న నేతలు స్పందించాలి. గత ఐదేళ్లలో రైతు ఏనాడూ ఇలా కంటతడి పెట్టలేదు. వారికివ్వాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలి. రైతు భరోసా రూ.20 వేల చొప్పున రెండేళ్లకు కలిసి వెంటనే వెయ్యాలి.

– వంగా గీతా విశ్వనాథ్‌, మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పిఠాపురం

మోసానికే ప్రాధాన్యం!1
1/3

మోసానికే ప్రాధాన్యం!

మోసానికే ప్రాధాన్యం!2
2/3

మోసానికే ప్రాధాన్యం!

మోసానికే ప్రాధాన్యం!3
3/3

మోసానికే ప్రాధాన్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement