
తొలి తిరుపతి.. భక్తఝరి
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.3,39,087 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
కాకినాడ – సామర్లకోట మధ్య
నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు
ఫ్లై ఓవర్పై గడ్డర్ల ఏర్పాటు పనులు ప్రారంభం
సామర్లకోట: ఏడీబీ రోడ్డులో అచ్చంపేట – సామర్లకోట రాక్ సిరామిక్స్ వరకూ భారత్ మాల జాతీయ రహదారి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా సామర్లకోట – కాకినాడ మధ్య ముత్యాలమ్మ ఆలయం సమీపాన నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రెడీమేడ్ గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటిని వంతెన వద్దకు చేర్చారు. వీటిని బ్రిడ్జి స్తంభాలకు కలుపుతూ అమరుస్తారు. ఈ పనుల నేపథ్యంలో కాకినాడ – సామర్లకోట మధ్య ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. కాకినాడ నుంచి సామర్లకోట వచ్చే వాహనాలను ఈ నెల 10వ తేదీ వరకూ వీకే రాయపురం నుంచి అచ్చంపేట ఏడీబీ రోడ్డుకు మళ్లిస్తారు. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు ఏడీబీ రోడ్డు నుంచి వీకే రాయపురం, అచ్చంపేట, పనసపాడు, సర్పవరం మీదుగా మళ్లిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ వంతెనపై గడ్డర్ల ఏర్పాటు పనులు గత నెల 21నే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా వేశారు.
యోగా దైనందిన
జీవితంలో భాగం కావాలి
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో విధులు సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ సెంటర్ వరకూ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్ భావన, అదనపు ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ తదితర అధికారులతో పాటు వివిధ శాఖల నుంచి సుమారు 5 వేల మంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా శిక్షకుడు రామానంద అందరితో యోగాసనాలు వేయించారు.
రేపు పీజీఆర్ఎస్ రద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం అనివార్య కారణాలతో రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అర్జీదారులు గమనించాలని కోరారు.

తొలి తిరుపతి.. భక్తఝరి

తొలి తిరుపతి.. భక్తఝరి