
సీలేరులో యువకుడి గల్లంతు
● నలుగురిని రక్షించిన పోలీసులు
● బాధితులు దేవరపల్లి వాసులు
● నదిలో స్నానాలు చేస్తూండగా ప్రమాదం
దేవరపల్లి/మోతుగూడెం: స్నేహితులతో విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తూండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు ఇక్కడకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఎ.నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తూండగా అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగిలిన నలుగురూ నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో ఎస్సై సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్ల సాయంతో నలుగురు యువకులనూ ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకూ లభ్యం కాలేదు. దీంతో అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహార యాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేస్త్రులుగా పని చేస్తున్నారు.