
సేవకులకు తీరనున్న ఇక్కట్లు
● సత్యదేవుని సన్నిధిన ప్రత్యేక ఏర్పాట్లు
● సేవ చేయాలనుకునే వారి కోసం 08868–238163 నంబర్తో
ఫోన్ సౌకర్యం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవ చేద్దామనుకునే వారికి ఇకపై కష్టాలు తొలగనున్నాయి. సేవ చేద్దామనుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలోని పీఆర్ఓ కార్యాలయాన్ని 08868–238163 నంబరులో సంప్రదించే అవకాశం కల్పించారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. సేవ చేయడానికి వస్తున్న చాలా మంది భక్తులు ఎవరిని సంప్రదించాలో తెలిపే ఏర్పాటు దేవస్థానంలో లేక మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వారు ఆ సేవకుల నుంచి నగదు వసూలు చేయడం ఇటీవల వివాదంగా మారింది. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవకులు గత నెలలో ఇదేవిధంగా రాగా.. వారికి సేవ చేసే అవకాశం లేదంటూ ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించడం, వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దేవస్థానంలో సేవ చేసే అవకాశం కల్పించేందుకు ఆ మహిళా సేవకులు మధ్యవర్తిని ఆశ్రయించగా ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసినట్టు దేవస్థానం అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రత్నగిరిపై సేవకుల ఇబ్బందులపై మే 24న ‘సేవ చేయనివ్వరు స్వామీ..’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. సేవ చేయాలనుకునే వారు సంప్రదించేందుకు టీటీడీలో మాదిరిగా అన్నవరం దేవస్థానంలో ఏర్పాట్లు లేవని ఆ కథనంలో పేర్కొనడంతో అధికారులు స్పందించారు. రత్నగిరిపై సేవ చేయాలనుకునే వారు ఇక నుంచి తమ పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో దేవస్థానం పీఆర్ఓ కార్యాలయంలో నమోదు చేయించుకునే అవకాశం కల్పించారు. అయితే, దీంతో పాటు మొబైల్ నంబర్ కూడా ఏర్పాటు చేసి, వాట్సాప్ ద్వారా వివరాలు పంపించే ఏర్పాట్లు చేయాలని పలువురు సేవా కార్యకర్తలు కోరుతున్నారు.

సేవకులకు తీరనున్న ఇక్కట్లు

సేవకులకు తీరనున్న ఇక్కట్లు