వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమం | - | Sakshi
Sakshi News home page

వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమం

Jun 7 2025 12:18 AM | Updated on Jun 7 2025 12:18 AM

వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమం

వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమం

అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీ హోమం నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీ హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు, నైవేద్యం సమర్పించారు. వనదుర్గ అమ్మవారికి నిర్వహించిన హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్‌ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా

రామస్వామి బాధ్యతలు

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా తుమ్మల రామస్వామి (బాబు) శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనా డీసీసీబీ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించారు. బ్యాంకు సీఈఓ ఆర్‌వీ నరసింహారావు తుమ్మల బాబుతో సంతకాలు చేయించారు.

డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

– తొలిరోజు 893 మంది హాజరు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి నిర్వహిస్తున్న డీఎస్సీ–25 ఆన్‌లైన్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ఉదయం ఐదు, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. రెండు సెషన్‌లకు సంబంధించి 1,024 మంది హాజరుకావలసి ఉండగా 893 మంది పరీక్షలు రాయగా 131మంది గైర్హాజరయ్యారని డీఈఓ పిల్లి రమేష్‌ తెలిపారు.

9న షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కోసం ప్రభుత్వం షైనింగ్‌స్టార్స్‌ కార్యక్రమం చేపడుతోంది. ఈ నెల 9న కుళాయిచెరువు ఆవరణలో గల ఫ్యాబ్రిక్‌ కన్వెన్షన్‌ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 132 మంది పదోతరగతి, 36 మంది ఇంటర్‌ విద్యార్థులు కలిపి 168 మందిని ఎంపిక చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.20వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మండల స్థాయిలో 500 మార్కులు పైబడి వచ్చిన వారిని ఆరుగురిని ఎంపిక చేశారు. వీరిలో ఒసీ 2, బీసీ 2, ఎస్‌సీ1, ఎస్టీ1 ఎంపిక చేశారు. ఇంటర్మీడియెట్‌లో 830 మార్కులు పైబడి వచ్చిన వారిని ఎంపిక చేశారు.

రేపటి నుంచి జిల్లా స్థాయి

యోగా పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 11 వరకు జిల్లా క్రీడామైదానంలోని యోగాహాల్‌లో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 60 సంవ్సరాల పైబడిన వారు సీనియర్స్‌ విభాగంలో, 9వ తేదీన జూనియర్స్‌ 10 నుంచి 18 సంవత్సరాల విభాగంలో, 10న యూత్‌ 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల విభాగంలో, 11న సీనియర్స్‌ విభాగంలో 36 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వారికి, 11న సీనియర్‌ సిటిజన్‌ విభాగంలో 60 సంవత్సరాల పైబడిన వారికి ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు ఆయా తేదీలలో యోగా సూట్‌ ధరించి పోటీలకు ఉదయం 8 గంటలోపు హాజరుకావాలని శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు మండలస్థాయిలో మొదటి రెండు స్థానాలు సాధించిన వారు అర్హులన్నారు. వివరాలకు 89196 42248 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement