
అమ్మకు వంచన
స్పష్టత లేదు
మా అబ్బాయి ఈ ఏడాది 8వ తరగతికి వెళ్లనున్నాడు. గత ఏడాది తల్లికి వందనం నగదు ఇవ్వలేదు. ఈ ఏడాది ఇస్తామంటున్నారు కానీ ఎటువంటి స్పష్టతా రాలేదు. ఆ డబ్బులు త్వరగా ఇస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమయ్యేది.
– వై.ధనలక్ష్మి, పిఠాపురం
ఎన్నికల హామీ ఏమైంది?
నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి చదువుకుంటున్నాడు. అమ్మాయి ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదవనుంది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. ఆ హామీ ఏమైంది? ఇప్పటికీ అందలేదు. ప్రభుత్వం సాయం అందిస్తే పిల్లల చదువుకు ఆసరాగా ఉంటుంది.
– సీహెచ్ సుధీర్కుమార్, కాకినాడ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
అమ్మ ఒడి లబ్ధి (రూ.కోట్లలో)
సంవత్సరం లబ్ధిదారులు లబ్ధి
2019–20 1,87,654 281.48
2020–21 2,01,247 301.86
2021–22 1,88,157 282.23
2022–23 1,86,708 280.06
మొత్తం 7,63,766 1145.63
● ఏడాదైనా అందని ‘తల్లికి వందనం’
● 3.20 లక్షల మంది ఎదురుచూపులు
● కూటమి పాలనలో దగా పడ్డ తల్లులు, విద్యార్థులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు’– ఈ మాటలు ఎక్కడో విన్నట్లుంది కదూ. సరిగ్గా ఏడాది కిందట నాటి సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నేతలైన చంద్రబాబు అండ్ కో ‘తల్లికి వందనం’ పేరిట ఊరూవాడా అమ్మలను ఊరిస్తూ చెప్పిన మాటలివి. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆ మాటే మరిచారు. మొదటి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది ఇస్తామంటున్నారు కానీ.. ఇప్పటి వరకూ విధివిధానాలేవీ రాలేదు. పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే సమున్నత లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పట్లో ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేశారు. ఏటా రూ.15 వేల చొప్పున జమ చేశారు. ఈవిధంగా జిల్లాలో రూ.1,145.63 కోట్ల మేర ‘అమ్మ ఒడి’ సాయం అందించారు. దీంతో, అప్పట్లో పేద పిల్లల చదువులకు ఢోకా ఉండేది కాదు.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూటమి మేనిఫెస్టోలో ‘తల్లికి వందనం’ పేరిట పాఠశాల, ఇంటర్మీడియెట్ చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదే మాట తప్పారు. రెండో ఏడాది నూతన విద్యా సంవత్సరం కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికీ తల్లికి వందనం డబ్బులు ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వ తీరుతో కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని విమర్శిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్యాలెండర్, తేదీ విడుదల చేసి మరీ, నేరుగా ఆర్థిక సాయం జమ చేసేవారని గుర్తు చేసుకుంటున్నారు.
ఎగ్గొట్టింది రూ.485 కోట్లు
జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో 3.20 లక్షల మంది విద్యార్థులకు రూ.485.35 కోట్లు అందజేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి కూడా సుమారు ఇదే మొత్తం ఇవ్వాల్సి ఉంది. అంటే, రెండేళ్లకు కలిపి సుమారు రూ.971.7 కోట్లు జమ చేయాల్సి ఉంది. రెండేళ్ల సొమ్ము ఇస్తారేమోనని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద సాయం అందించేవారు. దీంతో, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు, విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు, బెల్టుల వంటి వస్తువుల కొనుగోలుకు తల్లిదండ్రులకు వెసులుబాటు ఉండేది. కూటమి ప్రభుత్వ పాలనలో ఒక విద్యా సంవత్సరం పూర్తయి, కొత్తది ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకూ తల్లికి వందనం నిధుల ఊసే లేకుండా పోయింది. దీనిపై సర్వేలు, ఎటువంటి కార్యాచరణా ప్రారంభించలేదు. ఇప్పటికే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టలేదు. ధాన్యం సహా ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లభించలేదు. దీనికితోడు అన్ని రకాల సంక్షేమ పథకాలనూ నిలిపివేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చేతుల్లో డబ్బుల్లేక బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తల్లికి వందనం నిధులు త్వరగా విడుదల చేస్తేనే తమ పిల్లలను నిశ్చింతగా చదివించుకోగలమని తల్లిదండ్రులు చెబుతున్నారు. లేకుంటే వారిని చదువు మాన్పించడం తప్ప గత్యంతరం లేదని ఆవేదన చెందుతున్నారు.

అమ్మకు వంచన

అమ్మకు వంచన

అమ్మకు వంచన