
ప్రవీణ్ సంస్మరణ సభకు అనుమతి
రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు హైకోర్టు లైన్ క్లియర్ చేసిందని, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తరఫు న్యాయవాది బాల గురువారం విలేకర్లకు తెలి పారు. గత నెల 24న ప్రవీణ్ పడగాల సంస్మరణ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హర్షకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయవాది బాల హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. మే 28న కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు అనుమతి ఇచ్చారని, అటువంటిది సామాన్య ప్రజలు సంస్మరణ సభ నిర్వహించేందుకు అనుమతులు నిరాకరించారని ప్రస్తావించారు. వాదనల అనంతరం, ప్రవీణ్ సంస్మరణ సభకు సంబంధించి కొత్తగా చేసే దరఖాస్తుపై నాలుగు వారాల్లో ఏదో ఒక రోజు అనుమతివ్వాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించిందని బాల తెలిపారు. సభ అనుమతుల కోసం త్వరలోనే జిల్లా పోలీసు కార్యాలయంలో దరఖాస్తు చేస్తానని, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సభ నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు.
సెంట్రల్ జైలును సందర్శించిన
అటవీ అధికారులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎన్ఎన్ మూర్తి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఫణీంద్ర ధర్మ గురువారం సందర్శించారు. జైలులోని నర్సరీ గురించి వారికి కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కారాగారానికి బయో డైవర్సిటీ పురస్కారం అందజేసిందని చెప్పారు. వందేళ్ల వయస్సుకు పైబడిన వృక్షాలను అటవీ శాఖ అధికారులకు ఆయన చూపించారు. కారాగారంలో నర్సరీని అభివృద్ధి చేసిన జైలు అధికారులను అటవీ అధికారులు ప్రశంసించారు. అనంతరం కారాగారంలోని పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు.