కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదేం? | - | Sakshi
Sakshi News home page

కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదేం?

Jun 1 2025 12:15 AM | Updated on Jun 1 2025 9:38 AM

కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదేం?

కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదేం?

సామర్లకోట: ప్రతి నెలా జరగాల్సిన కౌన్సిల్‌ సాధారణ సమావేశం మే నెలలో నిర్వహించకపోవడంపై సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 24 మంది వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం నశించాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఉబా జాన్‌ మోజెస్‌ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు కూడా నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం మే నెలలో నిర్వహించకపోవడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మే 15న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ తన పదవికి రాజీనామా చేశారని, అదే రోజు ఆమైపె 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారని గుర్తు చేశారు. అదే సమయంలో సభ్యులందరూ కలిసి అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరినా కమిషనర్‌ ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదన్నారు. సాధారణ సమావేశం నిర్వహణకు నాలుగు రోజుల ముందు, అత్యవసర సమావేశానికి 24 గంటల ముందుగా అజెండా రావాల్సి ఉండగా శనివారం వరకూ అందలేదని, దీంతో సమావేశం జరిగే అవకాశం లేదని తెలిసి, నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో అభివృద్ధి పనుల ఆమోదానికి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని, అలా జరగకపోవడంతో అభివృద్ధి కుంటుబడే అవకాశం ఉందని అన్నారు. సభ్యులు ఆయా వార్డుల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కౌన్సిల్‌ సమావేశం దోహదపడుతుందన్నారు. కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు కాకపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని జాన్‌ మోజెస్‌ డిమాండ్‌ చేశారు.

కమిషనర్‌కు వినతి

మే నెలలో సాధారణ లేదా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయకపోవడానికి కారణమేమిటని 24 మంది కౌన్సిలర్లు కమిషనర్‌ ఎ.శ్రీవిద్యను నిలదీశారు. ఈ మేరకు వారందరి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. కమిషనర్‌ బదులిస్తూ చైర్‌పర్సన్‌ అంశం కోర్టులో ఉన్నందున సమావేశం నిర్వహించలేకపోయామని చెప్పారు. సీడీఎంఎ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. రాజీనామా అనంతరం మరుసటి రోజునే చైర్‌పర్సన్‌ రాజీనామాను ఉపసంహరించుకున్నారని, మెజార్టీ సభ్యులు వైస్‌ చైర్మన్‌ జాన్‌ మోజెస్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని అదే రోజు కోరారని చెప్పారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని, తాను స్వయంగా నిర్ణయం తీసుకునే అంశం కాదని అన్నారు. సమావేశం జరగకపోవడంతో మే నెల గౌరవ వేతనం ఉండదని సభ్యులు అడిగి ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 15 రోజుల గడువు ఉన్నా అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో వైస్‌ చైర్మన్‌–2 గోకిన సునేత్రాదేవి, 22 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఫ సామర్లకోటలో

మున్సిపల్‌ కౌన్సిలర్ల నిరసన

ఫ కమిషనర్‌ నిలదీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement