
కోరం లేక ‘కోట’ మున్సిపల్ సమావేశం వాయిదా
సామర్లకోట: కోరం లేకపోవడంతో సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ ప్రకటించారు. బుధవారం ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా కౌన్సిల్ సభ్యులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన కాళ్ల శ్యామల, చల్లపల్లి వెంకట సత్యనారాయణ మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం సరిపోలేదు. కౌన్సిల్లో 31 మంది సభ్యులుండగా 29 మంది వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఒక కౌన్సిలర్ మృతి చెందగా ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం నాలుగుకు చేరుకుంది. ప్రస్తుత సమావేశం నిర్వహణకు 16 మంది సభ్యులుండాలి, ఐదుగురే హాజరుకావడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అరుణ ప్రకటించారు. ఏప్రిల్ రెండవ తేదీన చైర్మన్పై బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని 22 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. మూడవ తేదీన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు వైఎస్సార్ సీపీ అరుణను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో అరుణ సమావేశం నిర్వహణకు సిద్ధంకాగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధికి రూ.మూడు కోట్లు మంజూరయ్యాయని, కౌన్సిల్లో చర్చించి ఆమోదించాల్సి ఉండగా సభ్యుల హాజరుకాలేదని చైర్ పర్సన్ అరుణ అన్నారు.