
ఉప ముఖ్యమంత్రి పవన్ హడావుడితో పోర్టుకు నష్టం
కాకినాడ సిటీ: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హడావుడితో దెబ్బతింటున్న పోర్టు ఎగుమతి, దిగుమతులపై అధికారులు దృష్టి సారించి ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే పోర్టు ఎగుమతి దిగుమతులు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సీపీఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం సుందరయ్యభవన్లో కె.సత్తిరాజు అధ్యక్షత జరిగిన సమావేశంలో సీపీఎం నాయకులు మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోర్టులో బియ్యం ఎగుమతులపై చేసిన హడావుడి వల్ల పోర్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కాకినాడ పోర్టు ద్వారా జరగాల్సిన ఎగుమతి, దిగుమతులు విశాఖ, కృష్ణపట్నం రేవుల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు లావాదేవీలు వేగంగా జరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ జిల్లా మంత్రిగా ఉండడం వల్ల పిఠాపురంతో పాటు జిల్లా అంతా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని, దానిలో భాగంగా జిల్లా కేంద్రమైన కాకినాడ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. అభివృద్ధికి కొలమానం ఉపాధి కల్పనే అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఉపముఖ్యమంత్రి కార్యాచరణ అందుకు తగిన విధంగా లేదన్నారు. ఇప్పటికై నా రాజకీయ ప్రయోజనాల చట్రంలో కూరుకుపోకుండా చిత్తశుద్ధిగా, అభివృద్ధి దిశగా ఉపముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సీపీఎం కోరుతోందని నాయకులు అన్నారు. సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నాయకులు దుంపల ప్రసాద్, వేణు, మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ పాల్గొన్నారు.
దెబ్బతింటున్న ఎగుమతి, దిగుమతులు
ఉపాధి కోల్పోయి,
ఇబ్బందులు పడుతున్న కార్మికులు
సీపీఎం సమావేశంలో నేతలు