
5 నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
కాకినాడ సిటీ: వచ్చే నెల 5 నుంచి కాకినాడ రూరల్ వాకలపూడిలోని దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) సెంటర్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ శిక్షణకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాల లోపు పురుష అభ్యర్థులు అర్హులన్నారు. టూ వీలర్ టెక్నీషియన్, వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్ కోర్సులకు మూడు నెలల శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ ఇస్తారన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ అందిస్తారన్నారు. వీటితో పాటు అదనంగా బేసిక్ కంప్యూటర్ కోర్సు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్పై కూడా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 4వ తేదీ లోపు 83284 83297, 89784 75164 మొబైల్ నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లచ్చారావు సూచించారు.
పహల్గాం ఉగ్ర దాడి
అమానుషం
తుని: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి అత్యంత కిరాతకమని తపోవన ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తుని మండలం కుమ్మరిలోవలోని తపోవనంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి, హతమార్చడం హేయమని పేర్కొన్నారు. ఉగ్ర భావజాలంతో ఉన్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి, సామరస్యమే ఉన్నతమైన వాతావరణాన్ని తీసుకు వస్తుందని చెప్పారు. హింసాత్మక సంఘటనలు ఎటువంటి ప్రభావాన్నీ చూపించవన్నారు. మతపరమైన భావజాలంతో ఇటువంటి దుశ్చర్యలకు ఒడిగట్టడం దారుణమైన విషయమన్నారు. భారతదేశం మతాలు, వర్గాలకు అతీతంగా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదం అందరికీ ఉమ్మడి శత్రువని, కేంద్ర నాయకత్వానికి భారతీయులు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.
టీచర్ల కోసం ప్రత్యేక సదుపాయాలు
కాకినాడ క్రైం: వైద్య ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం కాకినాడ జీజీహెచ్కు వస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ తెలిపారు. ప్రత్యేక ఓపీ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేసి, మైక్లో ప్రచారం చేస్తున్నామన్నారు. సెమినార్ హాలులో ఆర్థో, న్యూరాలజీ సమస్యలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. మెడికల్ డిపార్టుమెంట్ కాన్ఫరెన్స్ హాలులో మెడికల్ ధ్రువీకరణ పత్రాలు, ఆప్తాల్మాలజీ డిపార్టుమెంట్లో కంటి సమస్య ఉన్నవారి పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, ఈఎన్టీ ధ్రువీకరణ పత్రాలను సోమ, శనివారాల్లో పరిశీలించనున్నామని డాక్టర్ విఠల్ తెలిపారు. రేడియేషన్ డిపెండెంట్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన క్యాన్సర్ వార్డులో నిర్వహిస్తున్నామన్నారు. టీచర్ల సహాయార్థం నర్సులను నియమించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు నలుగురు క్లర్కులను నియమించామన్నారు. అలాగే మార్గనిర్దేశం కోసం సీనియర్ నర్సులను కూడా నియమించామన్నారు. శుక్రవారం 208 మంది టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని విఠల్ తెలిపారు.
లోక్ అదాలత్ వాయిదా
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్):
వచ్చే నెల 10న నిర్వహించ తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ను జూలై 5వ తేదీకి వాయిదా వేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఈ విషయం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో జిల్లా న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జూలై 5న జిల్లావ్యాప్తంగా జరగనున్న లోక్ అదాలత్లో అధిక మొత్తంలో రాజీ పడదగిన ఎకై ్సజ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బి.పద్మ, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు సీహెచ్ లావణ్య, ఎం.కృష్ణకుమారి, ఎస్కేడీవీ ప్రసాద్, పీఎన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

5 నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ