
శ్రీషిర్డీసాయి విద్యార్థుల విజయభేరి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలలో శ్రీ షిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్ మోక్షిత్ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్ శ్రీరామ్ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2000 లోపు, 45 మంది 5000 లోపు, 64 మంది 10000 లోపు, 88 మంది 20000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్కు అర్హత సాధించవచ్చునన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు.