● గ్రీవెన్స్లో జనసేన పెత్తనమేమిటి?
● ప్రజా సంఘాల నాయకుల నిలదీత
పిఠాపురం: ‘ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికా లేక పార్టీ కార్యాలయమా చెప్పాలి’ అంటూ ప్రజాసంఘాల నాయకులు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ ఎ.చైత్రవర్షిణిని ప్రశ్నించారు. పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు సాకా రామకృష్ణ, కుంచె చిన్న తదితరులు వచ్చారు. ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే.. అధికారులకు, ప్రజలకు అసౌకర్యంగా ఉండేలా ఇరుకు గదిలో ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పైగా ప్రజా సమస్యలపై అధికారుల కంటే ముందే జనసేన నాయకులు సమాధానం చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు చేపట్టిన కార్యక్రమంలో అధికార పార్టీ నాయకుల పెత్తనమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం గురించి వివరణ కోరితే జనసేన నాయకులు ‘ఇది మా అడ్డా.. మేమే సమాచారం ఇస్తాం’ అంటూ అవహేళనగా మాట్లాడారని అన్నారు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం చూస్తూంటే అధికారుల మద్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇకముందు క్రమపద్ధతిలో ఈ కార్యక్రమం చేపట్టాలని పీడీని కోరారు. పెన్షన్ల దరఖాస్తులపై అడిగితే సైట్ ఓపెన్ అవడం లేదంటున్నారని, 9 నెలలుగా ఎదురు చూస్తున్నా ఇలా వంకలు చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి తక్షణమే సైట్ ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇకపై ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.