తలుపులమ్మ తల్లి దర్శనానికి తరలివచ్చిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

తలుపులమ్మ తల్లి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

Mar 17 2025 12:09 AM | Updated on Apr 1 2025 1:22 PM

తుని రూరల్‌: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ తల్లి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 22 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,49,040, పూజా టికెట్లకు రూ.91,320, కేశఖండనకు రూ.14,810, వాహన పూజలకు రూ.4,350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.73,072, విరాళాలు రూ.1,06,485 కలిపి మొత్తం రూ.4,39,077 ఆదాయం సమకూరిందని వివరించారు.

జనార్దనాచార్యులుకు అవార్డు ప్రదానం

పిఠాపురం: స్థానిక రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ అర్చకుడు విజయ జనార్దనాచార్యులుకు అర్చక సేవా వైభవ రత్న పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్‌ హరిహర కళాభవన్‌లో సర్‌ సీవీ రామన్‌ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యాన 33వ ఉగాది వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం సువర్ణ ఘంటా కంకణం, స్వర్ణ పతకంతో జనార్దనాచార్యులును సత్కరించి, బిరుదు ప్రదానం చేశారు. వేణుగోపాలస్వామి ఆలయం, ఇతర దేవాలయాల అభివృద్ధికి, సమాజ సేవలకు గానూ ఈ పురస్కారం అందజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శంకరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు.

నేడు పీజీఆర్‌ఎస్‌

కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ఆయా అధికారులు ఉదయం 9.30 గంటలకే విధిగా హాజరు కావాలని పేర్కొన్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి

అమలాపురం టౌన్‌: స్థానిక 22వ వార్డు పరిధిలోని గొవ్వాలవారి వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు గొవ్వాల సూర్యకాంతం (110) ఆదివారం మృతి చెందారు. ఈమె 22వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌, వైఎస్సార్‌ సీపీ నాయకుడు గొవ్వాల రాజేష్‌ నానమ్మ. మూడు నెలల కిందటి వరకూ నానమ్మ ఏ ఒక్కరి సాయం లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ జీవించిందని రాజేష్‌ తెలిపారు. మూడు నెలలగా మంచాన పడి చివరకు వృద్ధాప్యంతో మృతి చెందిందన్నారు. సూర్యకాంతానికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, దాదాపు 40 మంది వరకూ మనుమలు, ముని మనుమలు ఉన్నారు.

అయినవిల్లికి భక్తుల తాకిడి

అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామిని ఆదివారం ఆధిక సంఖ్యలో భక్తులు దర్శించుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి, మహానివేదన చేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 56 మంది, లక్ష్మీగణపతి హోమంలో 31 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో ఒక జంట, స్వామివారి గరిక పూజలో రెండు జంటలు పాల్గొన్నాయి. 

పది మంది భక్తులు ఉండ్రాళ్ల పూజలు జరిపారు. 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, ఐదుగురు చిన్నారులకు అన్నప్రాశనలు, ముగ్గురు చిన్నారులకు నామకరణం, 13 మందికి తులాభారం చేశారు. 16 మంది తలనీలాలు సమర్పించారు. 25 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 3,510 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ రూపాల్లో రూ.2,93,437 ఆదాయం లభించింది.

జనార్దనాచార్యులుకు అవార్డు ప్రదానం1
1/2

జనార్దనాచార్యులుకు అవార్డు ప్రదానం

తలుపులమ్మ తల్లి దర్శనానికి  తరలివచ్చిన భక్తులు 2
2/2

తలుపులమ్మ తల్లి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement