
స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
కాకినాడ సిటీ: ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి కొండయ్యపాలెం శారదా దేవి గుడి సెంటర్ వరకూ శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కలెక్టర్ షణ్మోహన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. వీరపాండ్యన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, పారిశుధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్, పంచాయతీ కార్మికులదే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి కూడా ప్రసంగించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పిస్తూ శారదా దేవి గుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్సీ పద్మశ్రీ ప్రారంభించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ సిబ్బంది నిర్వహించిన రంగోలీ కార్యక్రమాన్ని వీరపాండ్యన్, షణ్మోహన్, డీఆర్వో వెంకటరావు పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.