
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 457 పాఠశాలల నుంచి 28,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరిలో రెగ్యులర్ 27,500 మంది ఉండగా వీరిలో బాలురు 13,765 మంది, బాలికలు 13,735 మంది ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు సప్లిమెంటరీ విధానంలో రాస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీలకు వచ్చే అధికారులు సైతం తమ ఫోన్లను గది వెలుపలే విడిచిపెట్టి లోపలకు వెళ్లాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు కారణమైన వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని డీఈఓ హెచ్చరించారు.
ఓపెన్ పరీక్షలకు 2,248 మంది
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన నిర్వహించే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు సైతం సోమవారం ప్రారంభం కానున్నాయని డీఈఓ రమేష్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,248 మంది హాజరవుతున్నారని, వీరి కోసం 26 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.