సత్రం భవనం నిర్మాణంపై సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

సత్రం భవనం నిర్మాణంపై సందిగ్ధం

Mar 5 2025 12:06 AM | Updated on Mar 5 2025 12:05 AM

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.11.40 కోట్లతో నిర్మించనున్న శ్రీ సీతారామ సత్రం (ఎస్‌ఆర్‌సీ) నిర్మాణం సందిగ్ధంలో పడింది. దీని టెండర్లను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉండగా.. మంగళవారం దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు పి.కొండలరావు, చీఫ్‌ ఇంజినీర్‌ జీవీ శేఖర్‌, సాంకేతిక కమిటీ సభ్యులు దేవస్థానానికి వచ్చారు. ఈ సత్రాన్ని పడగొట్టి కొత్త భవనం నిర్మించేకన్నా పాత భవనానికి మరమ్మతులు చేసే విషయం పరిశీలించాలని సూచించారు. అయితే, పాత సత్రాన్ని కూల్చివేసి ఇనుము, కలప తీసుకు వెళ్లడానికి, సత్రం కూల్చివేయగా వచ్చిన వ్యర్థాలను బయటకు తరలించడానికి గాను దేవస్థానానికి రూ.4.50 లక్షలు చెల్లించేలా టెండర్‌ ఇప్పటికే ఖరారైంది. ఈ పరిస్థితుల్లో పాత భవనానికి మరమ్మతులు చేయాలంటూ నిపుణులు, ఉన్నతాధికారులు చేసిన సూచనలతో స్థానిక అధికారులు డోలాయమానంలో పడ్డారు.

గతంలోనే నిర్ణయం

రత్నగిరిపై భక్తుల వసతి గదుల సమస్య పరిష్కారానికి గాను సీతారామ సత్రం స్థలంలో రెండు బ్లాకులతో నూతన భవనం నిర్మాణానికి గత ఏడాదే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అప్పట్లో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసిన ప్రస్తుత దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాత సత్రాన్ని కూల్చివేయాలంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ఆ నిర్ణయం తీస్కున్నారు. నూతన సత్రాన్ని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశలో దక్షిణం వైపు నాలుగంతస్తుల్లో 105 గదులతో బ్లాక్‌–ఎ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేశారు. ఈ మేరకు గత జనవరిలో టెండర్లు పిలిచారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ వాహనాల పార్కింగ్‌కు వదిలేయాలని, 1, 2, 3 అంతస్తుల్లో ఫ్లోర్‌కు 35 చొప్పున 105 గదులు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా ఈ వారంలో ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో దేవదాయ శాఖ అధికారులు, నిపుణులు పాత సత్రాన్ని కూల్చకుండా తాత్కాలిక మరమ్మతులు చేయిస్తే ఇంకో పదేళ్లు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సత్రంలో కొన్ని గదులు వర్షానికి కారిపోతున్నాయని చెప్పగా.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లీకేజీలు అరికట్టాలని సూచించారు. రూ.11.40 కోట్లతో మరోచోట సత్రం 105 గదుల సత్రం నిర్మించాలని చెప్పారు. దీంతో సీతారామ సత్రం నూతన భవనం నిర్మాణంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయాన్ని కమిషనర్‌ రామచంద్రమోహన్‌ దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు గుర్రాజు, రాంబాబు, ఎలక్ట్రికల్‌ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫ పరిశీలించిన అధికారులు

ఫ మరమ్మతులకు అవకాశాలను

పరిశీలించాలన్న నిపుణులు

ఫ ఇప్పటికే రూ.11.40 కోట్లతో

కొత్త సత్రం నిర్మాణానికి టెండర్లు

ఫ నిపుణుల సలహాతో డోలాయమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement