రాజాపూర్(బాలానగర్): విద్యార్థుల ఆసక్తిని గుర్తించి.. వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటిషన్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మాక్ పార్లమెంట్ కాంపిటిషన్ను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మొదటిసారిగా నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారం, జ్ఞానం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య స్కూల్స్ నిర్వహిస్తుందని తెలిపారు. చట్టసభల్లో ప్రజల సమస్యలను లేవనెత్తి పరిష్కారానికి ఎలా కృషి చేయాలి.. సమాజానికి ఉపయోగపడే పాలసీలు తీసుకురావడం.. అసెంబ్లీ, పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చ సాగుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుభాష్ శుక్లా, నోడల్ అధికారి గంగాధర్, సర్పంచ్ గాయత్రి పాల్గొన్నారు.


