గద్వాల: తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాషా అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు. ముందుగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని కొనియాడారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకం అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.


