ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఆయా జిల్లాల కలెక్టక్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్–2 జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ ఆరా తీశారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు తదితర అంశాలపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాల్లో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు, అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల పరిశీలకుడు గంగాధర్, రాజేష్బాబు పాల్గొన్నారు.


