
కేసుల నమోదులో జాప్యం వద్దు : ఎస్పీ
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి ఆయన పట్టణ పోలీస్స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపట్టి.. పోలీసుశాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. కేసుల నమోదులో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయొద్దన్నారు. చోరీలను అరికట్టేందుకు నిత్యం కాలనీల్లో గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సైబర్ క్రైం, మహిళల వేధింపులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.