
బాల్యానికి బాసట..
31 వరకు జిల్లాలో ‘ఆపరేషన్ ముస్కాన్’
● బాల కార్మికులను వెట్టి నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం
● 2017 నుంచి ఇప్పటి వరకు 807 మంది చిన్నారుల గుర్తింపు
పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. జిల్లాలో నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపడుతున్నాం. బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రతి రోజు తనిఖీలు నిర్వహించి బడి బయటి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుటాం. ఆయా శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక బృంద సభ్యుల నిఘా ఉంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
గద్వాల క్రైం: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలనిస్తున్నది. తప్పిపోయిన, భిక్షాటన చేసే, ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే పిల్లలను గుర్తించి రక్షణ కల్పిస్తూ వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్నది. 2017 నుంచి 2025 వరకు 807 మంది చిన్నారులను గుర్తించి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ఈ నెల 31 వరకు కొనసాగనుండగా, బాలల గుర్తింపునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకనో మరో కారణం చేతనే కొందరు బాల బాలికలు చిన్నతనంలో పనుల్లో చేరి బందీ అవుతున్నారు. పంట పొలాల్లో కూలి పని, హోటళ్లు, ఫ్యాక్టరీలు, దుస్తుల దుకాణాలు, ఫాస్ట్ఫుడ్, సూపర్ మార్కెట్, ధనవంతుల ఇళ్లలో పనులు చేసేందుకు కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను పనిలో పెడుతున్నారు. ఈక్రమంలోనే పోలీసుశాఖ, కార్మిక శాఖ, బాలల సంరక్షణ, స్వచ్ఛంద సంస్థ అధికారులు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలతో చిన్నారులకు వెట్టి నుంచి విముక్తి కల్పించేందుకు ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 1వ తేది నుంచి 31వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ – 11తో బాల కార్మికులను గుర్తించి పాఠశాలకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. గద్వాల జిల్లాలో 2017 నుంచి ప్రస్తుతం(2025) వరకు 807 మంది చిన్నారులను గుర్తించింది.
విముక్తి దిశగా..
చిన్నారులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చి వారి కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారు. యాచకులు, బాలకార్మికులుగా ఉన్న వారిని ఆ పనుల నుంచి విముక్తి చేసి విద్యాభ్యాసం చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ముస్కాన్ ఈ నెల 31వ తేది వరకు జిల్లాలో కొనసాగనుంది. పోలీసుశాఖతో పాటు బాలల సంరక్షణ సమితి, కార్మిక శాఖ సమన్వయంతో బృందాలుగా వీడిపోయి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన పిల్లలను సీడబ్ల్యూసీ ముందుంచి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఇదిలాఉండగా, హోటళ్లు, ఇతర దుకాణ సముదాయాల్లో పని చేస్తున్న పిల్లలను గుర్తించి బడులకు పంపుతున్నా మళ్లీ కొంత కాలానికి తిరిగి పనుల్లోనే దర్శనమిస్తుండడం గమనార్హం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, కొంత మందికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా చేపడితేనే అనుకున్న లక్ష్యం సాధించవచ్చనే అభిప్రాయాన్ని ప్రజలు, మేధావి వర్గం వ్యక్తం చేస్తుంది.
జిల్లాలో గుర్తించిన బాలకార్మికుల వివరాలిలా..

బాల్యానికి బాసట..

బాల్యానికి బాసట..